అమరావతి పై సాక్షి మీడియాలో మొదలైన రచ్చ ఇప్పటికి రాచుకుంటూనే ఉంది. ఆ ఘటనకు నిరసనగా అమరావతి మహిళలు ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద తమ నిరసన ప్రదర్శన కొనసాగిస్తూ, సాక్షి లోగును ధ్వంసం చేసారు. అలాగే సాక్షి పత్రికలను తగలబెట్టారు.
అయితే ఆ మహిళా నరసనకారుల ఆగ్రహాన్ని అడ్డుకోవడానికి సాక్షి మేనేజ్మెంట్ మెయిన్ గేట్ కు తాళం వేసింది. సాక్షి చర్యలు, వైసీపీ విధానాలతో ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బ్లూ మీడియా ఒక అభూతకల్పనలు సృష్టించేందుకు సిద్ధపడ్డారు.
కొమ్మినేని అరెస్ట్, సాక్షి కార్యాలయం మీద దాడులతో ప్రజలలో అశాంతి నెలకొందని, వారంతా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అభద్రతా భావానికి లోనవుతున్నారంటూ సాక్షిలో కథనాలు వండి వడ్డిస్తున్నారు.
70 ఏళ్ళ వయస్సులో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ జరిగిన ఘటనలో తన ప్రమేయం లేకపోయినప్పటికీ క్షమాపణలు చెప్పారని, అయినా కూడా ఆయన అరెస్టు జరగడం ప్రజలను కలిచివేసిందని, ఇది పత్రిక స్వేచ్చకు సంకెళ్లు వంటివంటూ వారి ఆవేదనను ప్రజల రోదనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది సాక్షి.
అయితే మీడియాలు తమకు, తమ వారికి ఎంత అనుకూలంగా కథనాలు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు గుడ్డిగా వాటిని నమ్మే పరిస్థితి ఉండదు అనేది గత ఎన్నికల ఫలితాలతో రుజువయ్యింది. ప్రజలు బాధితుల పట్ల ఖచ్చితంగా సానుభూతి ని వ్యక్తపరుస్తారు.
అయితే ఇక్కడ కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియా బాధితులు కాదు, వారు పూర్తి సృహలో ఉండే రాజధాని అమరావతి పై ఇటువంటి నీచ పదజాలం ను ప్రయోగించి ప్రజల ముందు ముఖ్యంగా మహిళల ముందు దోషులుగా నిలబడ్డారు.
ఇలా తమకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశంలోనూ వైసీపీ సానుభూతిని ఆశించడం అత్యాశే అవుతుంది. వైసీపీ నుంచి ఒక నాయకుడు అరెస్టయిన ప్రతి సారి వారి పై ప్రజలలో సింపతీ సృష్టించేందుకు వైసీపీ వారి కుటుంబంలోని మహిళలను మీడియా ముందుకు తెచ్చి ఇటువంటి సానుభూతి కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే భ్రమలో ఉంచాలని భావిస్తున్నారు.
నాడు జోగి రమేష్ అరెస్టు సందర్భంగా ఆయన భార్యను తెరమీదకు తెచ్చిన వైనం, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి పంకజ శ్రీ ను మీడియాలో ప్రదర్శించిన తీరు, నందిగామ సురేష్ విషయంలో అతని భార్య పై వైసీపీ వేసిన రాజకీయ వల ఇవన్నీ కూడా “భర్తలను బలిపీఠలెక్కించి, భార్యలతో రాజకీయం” నడిపే వైసీపీ సిద్ధాంతంగా మారిపోయింది.
అయితే నాడు వైసీపీ నేత జోగి రమేష్ బాబు ఇంటి మీదకు దాడికి వెళ్లిన అంశాన్ని ప్రజలు అంగీకరించారా.? ఇక వల్లభనేని వంశీ భువనేశ్వరి పై వంశీ చేసిన పిచ్చి ప్రేలాపనలు ప్రజలు స్వాగతించారా.? రాజధాని మహిళల పై నందిగామ సురేష్ చేసిన దుశ్చర్యలకు ప్రజలు మద్దతు పలికారా.? అలా జరిగి ఉంటే నేడు ఈ సోకాల్డ్ వైసీపీ అందగాళ్ళందరూ అసెంబ్లీ గేటు లోపల ఉండేవారు కాదా.?
అలా జరగలేదు కాబట్టే వీరంతా జైలు కటకటాల వెనుక మగ్గుతున్నారు. అయితే ఇక్కడ ఎవరు దోషులో, ఎవరు బాధితులో తెలుసుకోనంత అమాయకులు కారు ప్రజలు. ఇటువంటి విషయంలో ప్రజలు పూర్తి స్పష్టతతో, తగిన సమయం కోసం వేచి చూసి దెబ్బకొడతారు అనేది ఈ ఎన్నికలలో వైసీపీ కి స్పష్టంగా తెలిసిఉండాలి.
అయినా కూడా అదే చౌకబారు కథనాలు, అవే అభూతకల్పనలు సృష్టించి ప్రజలను ఏమార్చాలని వైసీపీ, సాక్షి భావించడం వారి అవివేకమవుతుంది. వైసీపీ లో అరెస్టయిన నాయకుఅల్ను ఆ పార్టీ అధినేత అందగాళ్లుగా చిత్రీకరిస్తుంటే ఇప్పుడు సాక్షిలో అరెస్టయిన జర్నలిస్ట్ ను నిజాయితీ పరుడుగా, అత్యంత నీతివంతుడుగా ప్రచారం చేస్తుంది నీలి మీడియా.
కానీ కొమ్మినేని అరెస్టు విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై ఒక్క వైసీపీ, సాక్షి తప్ప మరొకరు ఎవరు తప్పుగా భావించడం లేదు, వారి అరెస్టులను ఖండించడం లేదు. అటు సాక్షి కానీ, ఇటు కొమ్మినేని కానీ ప్రభుత్వ చర్యలకు పూర్తి అర్హులనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.




