నాడు రామాయణంలో కుంభకర్ణుడు ఆర్నెల్లో ఏడాదో నిద్రపోయేవాడని చెప్పుకుంటాం. ఏపీ బిజేపి నేతల పరిస్థితి కూడా సరిగ్గా ఇదే.
హిందూమతం ఆధారంగా రాజకీయాలు చేసే బిజేపి నేతలు, వైసీపీ హయంలో తిరుమలతో సహా రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నా మేల్కొనలేదు. నిద్రలో కలవరించినట్లు అప్పుడప్పుడు మొక్కుబడిగా రెండు విమర్శలు చేసి మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకునేవారు.
దాదాపు ఏడాదిగా తిరుమల కల్తీ నెయ్యి, పరకామణిలో దొంగతనాలు, అన్యమత ప్రచారాలపై తీవ్ర స్థాయిలో టీడీపి-వైసీపీల మద్య యుద్ధం జరుగుతున్నా ఏపీ బిజేపి నేతలు మేల్కోలేదు. నిద్రలో కలవరింతలన్నట్లు సరిపెడుతున్నారు.
బిజేపి కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏపీ బిజేపి నేతలు ఎందుకు మేల్కొవట్లేదు? అంటే వారి అధిష్టానం మేల్కోమని పొడవడం లేదు కనుక! అని అనుకోవాలేమో?
కానీ ఇవాళ్ళ బిజేపి ఎమ్మెల్సీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు ధరించి శ్రీ వెంకటేశ్వరస్వామివారి చిత్ర పటాలు, ప్రతిమలు పట్టుకొని మండలిలోకి వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“జగన్ అన్యమతస్థుడు కనుక ఆయనకు స్వామివారి పట్ల భక్తి, నమ్మకం ఉండవు. కనుకనే కేజీ రూ.320ల చొప్పున కల్తీ నెయ్యి కొని ప్రసాదంలో వినియోగించారు. జగన్, బొత్స ఇళ్ళలో ఆ కల్తీ నెయ్యి వాడగలరా? జగన్ ఆదేశం మేరకే వైసీపీ సభ్యులు నేడు స్వామివారి చిత్రపటాలతో మండలికి వచ్చారు. తిరిగి వెళ్ళిపోతూ వాటిని అక్కడే విసిరేసి వెళ్ళిపోయారు.
హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న చిత్ర పటాలను, ఆయన ప్రసాదాన్ని అవహేళన చేస్తూ కోట్లాదిమంది హిందువుల మనోభావాలు జగన్ దెబ్బ తీస్తున్నారు,” అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా ఇన్ని అపచారాలు చేసి, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఇంత ధైర్యంగా కల్తీ నెయ్యి పేరుతో తిరుమల స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని సోము వీర్రాజుకి ఈరోజే తెలిసినట్లు మాట్లాడారు.
కనుక అయన నిద్రలో కలవరిస్తున్నారా లేక ఏడాది తర్వాత నిద్రాభంగం అయ్యి రంకెలు వేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది.
జగన్… వెంకటేశ్వర స్వామి, హిందుత్వo మీద మీకు చులకన భావం వుందా?#SomuVeerraju pic.twitter.com/CrQCsHnq45
— M9 NEWS (@M9News_) February 20, 2026






