వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయ్యి, జైలుకి వెళ్ళారనే వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. గత నాలుగైదు రోజులుగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండటంతో వైసీపీ ప్రభుత్వం, పోలీసులు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఓ వ్యక్తిని హత్య చేసిన తమ ఎమ్మెల్సీ అనంత బాబును సమర్ధించలేక, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేక తలలు పట్టుకొన్నారు. చివరికి ప్రతిపక్షాల ఒత్తిడి భరించలేక అనంత బాబును అరెస్ట్ చేసి, 14 రోజుల రిమాండ్పై జైలుకి పంపారని లేకుంటే పోలీసులు అతనిపై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆరోపించారు.
అయితే నిన్న కోనసీమ జిల్లాలోని అమలాపురంలో నిన్న జరిగిన ఘటనలతో ఒక్కసారిగా అందరి దృష్టి వాటిపైకి మళ్ళడంతో వైసీపీ మంత్రులకు ఉపశమనం లభించినట్లయింది. అంతేకాదు… అనంత బాబు వ్యవహారంతో ఇంతవరకు ఆత్మరక్షణలో పడిన వైసీపీ మంత్రులు ఇప్పుడు టిడిపి, జనసేనలలపై ఎదురుదాడి కూడా చేస్తున్నారు.
అమలాపురంలో నిన్న జరిగిన అల్లర్లకు ఎవరు బాధ్యులో తరువాత తెలుస్తుంది. కనుక దాని గురించి సాధికారికంగా మాట్లాడేందుకు కొంత సమయం ఉంది. అయితే అనంత బాబును ఎప్పుడు కస్టడీలో తీసుకొని ఆ వివరాలను రాబడతారు?ఆ కేసులో అనంత బాబుకి సహకరించిన మిగిలిన నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అసలు ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారా..లేక కోనసీమ అల్లర్ల కేసును వేగవంతం చేసి, ఎమ్మెల్సీ అనంత బాబు కేసును మెల్లగా అటకెక్కించేస్తారా? అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.



