ఎన్నికలలో రాజకీయ పార్టీల జయాపజయాలు సహజమే. తమిళనాడు మాజీ సిఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే తప్పకుండా గెలుస్తుందని సర్వేలు సూచించాయి. కానీ ఓడిపోయింది.
తమ పార్టీ ఓటమికి స్టాలిన్ ఎటువంటి సాకులు చెప్పలేదు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పారు. ప్రజాతీర్పుని గౌరవించి ప్రతిపక్షంలో కూర్చొంటామని, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు చేస్తామని చెప్పారు. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం స్థిరపడేవరకు ఆరు నెలల పాటు ఇబ్బంది పెట్టమని ముందే చెప్పారు.
ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీల నేతలు కూడా ఎన్నికలలో గెలుపోటములు సహజమే అని చెపుతుంటారు.
కానీ వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురూ కూడా ఈవిధంగా మాజీ సిఎం స్టాలిన్లా హుందాగా ఓటమిని అంగీకరించి, దానికి పూర్తి బాధ్యత మాదేనని చెప్పడానికి నేటికీ ఇష్టపడరు.
ఈవీఎంల వలన ఓడిపోయామని జగన్ చెప్పుకుంటే, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవడం వలన ఓడిపోయామని కేసీఆర్, కేటీఆర్ నేటికీ చెప్పుకుంటారు.
ద్రవిడ పార్టీలని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పే కేసీఆర్ మాత్రం స్టాలిన్లా ఓటమిని హుందాగా అంగీకరించలేదు. నేటికీ బహిరంగంగానే ప్రజాతీర్పుని తప్పు పడుతూ ‘అనుభవించండి మీ ఖర్మ’ అంటూ ప్రజలను శపిస్తూనే ఉన్నారు.
అంతేకాదు… మాజీ సిఎంలైన జగన్, కేసీఆర్ ఇద్దరూ నేటికీ శాసనసభ సమావేశాలకు హాజరవకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ ఏడాది పొడవునా జీతభత్యాలు, జెడ్ ప్లస్ భద్రత, కాన్వాయ్ సకల సదుపాయాలు నిర్మొహమాటంగా తీసుకుంటూనే ఉన్నారు.
అయినా ఈసారి ప్రజలు తప్పనిసరిగా తమనే ఎన్నుకుంటారని నమ్ముతున్నారు. ఎన్నుకోకతప్పదని చెపుతున్నారు కూడా. ఎన్నుకున్నాక తమ రాజకీయ ప్రత్యర్ధులపై పగ ప్రతీకారాలు తీర్చుకుంటామని కూడా చెపుతున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షిస్తామని ముందే చెపుతున్నారు.
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల అధినేతలు ఈవిధంగా వ్యవహరిస్తూ, మాట్లాడుతున్నప్పటికీ వారిని ప్రజలు తప్పక ఎన్నుకోవాల్సిందేనా? లేకుంటే ప్రజలదే తప్పా?






