టార్గెట్ 175 ఫిక్స్ కానీ పార్టీయే సిద్దంగా లేదా?

Target 175 fix but YSRCP party not readyవచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో 175కి 175 సీట్లు గెలుచుకోవాలని సిఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీకి టార్గెట్ నిర్ణయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నా నెలనెలా టంచునుగా బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఆ విషయం చెప్పుకొని ప్రజలను ప్రసన్నం చేసుకొమ్మని మంత్రులు, ఎమ్మెల్యేలను గడప గడపకి పరుగులు పెట్టిస్తున్నారు. సిఎం జగన్‌ స్వయంగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. మద్యలో జయహో బీసీ అని నినాదాలు చేస్తున్నారు. అయినా 100 సీట్లు అయినా గెలుచుకొనే పరిస్థితి లేదని ఎన్నికల వ్యూహానిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ బృందం ఐ-ప్యాక్ చెపుతుండటం సిఎం జగన్‌కి ఆందోళన కలిగిస్తోంది.

కనుక ఆ నివేదికని పక్కన పెట్టుకొని గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యి సుదీర్గంగా చర్చించారు. 175 సీట్లు లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి వారికి సూచించారు. దీని కోసం కొన్ని కీలకనిర్ణయాలు తీసుకొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కొత్తగా 5.20 లక్షల మంది గ్రామ సారధులను నియమించాలని నిర్ణయించారు. ప్రతీ సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించాలని నిర్ణయించారు. ప్రతీ 50 కుటుంబాలను ఓ క్లస్టరుగా పరిగణిస్తూ ఒక్కో క్లస్టరుకి ఇద్దరు లేదా ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లని నియమించి ఆ 50 కుటుంబాలు వైసీపీకి ఓటేసేలా వారికే బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. నేటి నుంచి పది రోజులలో ఈ నియమకాలు పూర్తిచేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులని, జిల్లా కోర్డినేటర్లను ఆదేశించారు.

ADVERTISEMENT

2024, ఫిభ్రవరి-మార్చి నెలల్లో జరుగబోయే ఎన్నికల కోసం సిఎం జగన్మోహన్ రెడ్డి చాలా నెలల క్రితమే కసరత్తు ప్రారంభించి 175 సీట్లు టార్గెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 4.50 లక్షలకు పైగా వాలంటీర్లు, మరో అన్ని లక్షల మంది పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పటికీ ఇప్పుడు మరో5.20 లక్షల మంది గ్రామ సారధులను నియమించాలనుకోవడం గొప్ప ఎన్నికల ప్రణాళిక అని వైసీపీ నేతలు చెప్పుకోవచ్చునేమోగానీ సిఎం జగన్మోహన్ రెడ్డిలో నెలకొన్న అభద్రతాభావానికి ఇది అద్దం పడుతోందని చెప్పవచ్చు.

ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే ఇంతకాలం తమ చేతిలో వేధింపులకు గురవుతున్న టిడిపి తనతో సహా వైసీపీలో ఎవరినీ విడిచిపెట్టబోదనే భయమే సిఎం జగన్‌ని గెలుపు కోసం ఇంతగా ఆరాటపడేలా చేస్తోందని చెప్పవచ్చు. కనుక ఈ ఒక్కసారికి గెలిచినట్లయితే మరో 30 ఏళ్ళ వరకు వైసీపీయే అధికారంలో ఉండేలా చేయగలనని సిఎం జగన్‌ చెప్పడానికి అర్దం ఏమింటంటే మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీలో టిడిపి, జనసేనలు నామరూపాలు లేకుండా చేయాలనిభావిస్తున్నట్లు భావించవచ్చు. ఈ విషయం టిడిపి, జనసేనలు కూడా బాగానే గ్రహించాయి కనుక వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాయి.

అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకి కట్టుబడి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తుండి ఉంటే అసలు ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదు. కానీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నందున ఓడిపోతే ఏమవుతుందో అనే భయం ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయంతోనే మళ్ళీ అధికారం జెక్కించుకొనే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తూ ప్రజాగ్రహానికి గురయ్యి ఏది జరగకూడదని కోరుకొంటోందో సరిగ్గా అదే జరిగేలా చేసుకొంటోందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories