టీడీపీ, జనసేన, బీజేపీ ల మధ్య బంధం మూడు ముక్కలవ్వాలని, మరి ముఖ్యంగా టీడీపీ – జనసేన ల మధ్య స్నేహం రాజకీయ విద్వేషంగా మారాలని, బాబు – పవన్ ల మధ్య పదవుల కుంపట్లు రగలాలని, పవన్ – లోకేష్ మధ్య అధికార పోరు జరగాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాగే వై నాట్.? అంటూ కలలు కంటూనే ఉంది.
అయితే వైసీపీ ఆశలను, జగన్ ఆశయాన్ని ఎట్టి పరిస్థితులలో నెరవేరనివ్వము అంటూ కూటమి నేతలు కూడా వైసీపీ కి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే వస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి పదిహేనేళ్ళు అవసరమని, అందుకు కూటమి బంధం అనివార్యం అంటూ ఇటు పార్టీ నేతలకు, ప్రజలకు అటు ప్రత్యర్థి వైసీపీ పార్టీకి పూర్తి స్పష్టత ఇస్తున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పవన్ మాటలను ఆచరణలో పెట్టాలంటూ, ఈ కూటమి బంధం స్వలాభానికి కాదు రాష్ట్ర ప్రగతికి, ఏపీ పురోగాభివృద్దికి అంటూ ఒకపక్క సొంత పార్టీ క్యాడర్ కి మార్గనిర్దేశం చేస్తూనే మరోపక్క వైసీపీ అధికారానికి మార్గాలు మూస్తున్నారు.
ఇక నిన్న డల్లాస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్ సైతం వీరిద్దరి అభిప్రాయాన్ని బలపరుస్తూ విదేశాలలో సైతం కూటమి పొత్తుకు మద్దతుపలికారు. మూడు పార్టీల శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ మాట్లాడుతూ ఈ మూడు పార్టీల పొత్తుకు విడాకులుండవు, మిస్ ఫైర్లుండవ్, క్రాస్ ఫైర్లుండవ్ అంటూ కూటమి బంధాన్ని మరోసారి తనదైన స్టైల్ లో నొక్కి వక్కాణించారు. ఇలా పదేపదే ఈ ముగ్గురు నేతలు తమ పార్టీల మధ్య ఉన్న బంధాన్ని తమ మధ్య ఏర్పడిన అనుబంధాన్ని సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా బహిరంగా బలపరుస్తున్నారు.
తద్వారా వైసీపీ అధికారంలో రావాలనే ఆశలను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కోరికలను, వైసీపీ 2.0 వేడుకలు నిర్వహించుకోవాలనే వారి ఉత్సుకతను, రప్ప రప్ప రాజకీయాలు చేయాలనే వారి అత్యాశను ఈ ముగ్గురు నేతలు వారి వారి ప్రకటనలతో ముక్కలు చేస్తున్నారు.






