తెలంగాణ అజెండా: అభివృద్ధి! మరి ఏపీ అజెండా?

Chandrababu Naiduఏపీ పునర్విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ పునాదిస్థాయి నుంచి రాష్ట్రాలని అభివృద్ధి చేసుకోవలసిన ఆగత్యం ఏర్పడింది. అయితే తెలంగాణకి కాసులు కురిపించే అక్షయపాత్ర వంటి హైదరాబాద్‌ నగరం లభించగా, ఏపీకి చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో నిలిచింది. ఆ సమయంలో అధికారులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్‌లో ఉంటూ రోజూ విజయవాడకి రాకపోకలు సాగించేవారు. దాంతో పరిపాలన ఎంతో కష్టమయ్యేది.

ADVERTISEMENT

అదేసమయంలో పక్కలో బల్లెంలా మారిన కేసీఆర్‌ పేచీలు, ప్రత్యేకహోదా కోసం జగన్‌ దీక్షలు, మరోపక్క ప్రకృతి విపత్తులు, విద్యుత్‌ కొరత… ఎటుచూసినా సమస్యలే. అటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు ఏపీని గాడినపెట్టగలిగారు. నెలనెలా ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇచ్చేవారు.

అదే సమయంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ప్రత్యర్దులని ఉక్కుపాదంతో అణచివేసి, తెలంగాణ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగారు. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి తన రాజకీయ ప్రత్యర్దుల జోలికిపోకుండా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. ఒకవేళ ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్‌లాగే తన రాజకీయ ప్రత్యర్ధులని కట్టడిచేసి ఉండి ఉంటే, ఆయన కూడా కేసీఆర్‌లాగే నేటికీ ఏపీలో అధికారంలో ఉండేవారేమో? కానీ రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అనుకోవడంతో రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నారు. చివరికి నష్టపోయారు.

అయితే “ఎన్నికలలో ఓడింది చంద్రబాబు నాయుడు లేదా టిడిపి కాదు… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం… ప్రజలే ఓడిపోయారు,” అని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అక్షరాల వాస్తవమని మూడున్నరేళ్ళ వైసీపీ పాలన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు.

పొరుగు రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రవాహంలా వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు చూస్తున్నప్పుడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఈ తేడా మరింత స్పష్టంగా కళ్ళకి కట్టిన్నట్లు కనిపిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వ అజెండా అభివృద్ధి అని అర్దమవుతూనే ఉంది. మరైతే ఏపీ ప్రభుత్వ అజెండా ఏమిటి?అని ప్రశ్నించుకొంటే సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, రాజకీయకక్ష సాధింపులు, వేధింపులు, కూల్చివేతలు, సంస్థల పేర్లు, రంగుల మార్పులు వంటివే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కనీసం వైసీపీ స్వయంగా ప్రతిపాదించిన మూడు రాజధానులని కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేకపోయింది. చూస్తుండగానే మూడున్నరేళ్ళు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ‘ఎక్కడున్నావే గొంగళి?అంటే వేసిన చోటే ఉన్నాను’ అని అన్నట్లుంది.

కనుక ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి ఏమవుతుందో… ఎలా ఉంటుందో తెలీదు కానీ ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే ఏబీసీడీ… అంటూ మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టకతప్పదు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో, ఈసారి అంతకంటే ఎక్కువే సమస్యలు ఎదుర్కొని పరిష్కరించాల్సి ఉంటుంది. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారో… రాజధాని అమరావతా? మూడు రాజధానులా లేదా విశాఖ రాజధానా?తెలీనిపరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఓ రాజకీయ ప్రయోగశాలగా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఈ రాజకీయ ప్రయోగాలు ఇంకా ఎప్పటికీ పూర్తవుతాయో… ఎప్పటికీ ఫలిస్తాయో ఎవరికీ తెలియదు. కనుక అంతవరకు రాష్ట్ర ప్రజలు ‘ఇదేమి ఖర్మ?’ అనుకొంటూ భరించాల్సిందే…తప్పదు!

ADVERTISEMENT
Latest Stories