గడిచిన నాలుగు రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు మోతాదుకు మించి పడడంతో రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద సహాయక కార్యక్రమాలలో ప్రభుత్వాలు, ప్రభుత్వాల మీద బురద జల్లే కార్యక్రమంలో ప్రతిపక్షాలు, ప్రభుత్వం సాయం కోసం వరద బాధితులు ఇలా ఎవరి పనిలో వారు మునిగిపోయారు.
అయితే వరణుడు కూడా ఇంకా తన పని పూర్తి కాలేదు, తానూ చేయాల్సిన విధ్వంసం ఇంకా మిగిలే ఉంది అన్నట్టుగా సూచికలు పంపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కొనసాగుతాయని హైద్రాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీనితో హైద్రాబాద్ వాసులకు మరో గండం పొంచి ఉన్నట్టే. ఇప్పటికే ఇటు హైడ్రా చర్యలతో కొందరు, అటు ప్రకృతి ప్రకోపానికి మరికొందరు నిరాశ్రయులయ్యారు. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారుల ఇక్కట్లకు అంతే లేకుండా పోతుంది. దీనితో ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించి రోడ్ల మీద కొంత ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ హైద్రాబాద్ వాతావారణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సుమారు 40-50 Kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటూ ఆయా ప్రాంతాల ప్రజలందరు అప్రమత్తంగా ఉంటాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ ప్రాంత ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ జల ప్రళయంతోనే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం జరిగి అనేకమంది ఇక్కట్ల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో విపరీతమైన ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక అగ్ని పరీక్ష వంటిదే. తెలంగాణ ప్రభుత్వం వరదాలలో చిక్కుకుని చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
మనుషుల అత్యాశ, అవసరాలు ప్రకృతి విధ్వంసానికి కారణంగా మారితే ఆ ప్రకృతే తిరిగి మనుషుల పాలిట మృత్యు గోషగా తిరిగి వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ జల కల్లోలం ఇప్పటికైనా శాంతించకపోతే మరిన్ని ప్రాణాలు, మరింత ఆస్తి జల సమాదిఅవ్వాల్సిందే.




