ఆ విధానాలే తెలంగాణ పాలిట శాపం… ఏపీకి శ్రీరామరక్ష!

Telangana Andhra politics

కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఎంత అవసరమో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను చూస్తే అర్ధమవుతుంది. కేసీఆర్‌ మొదటి నుంచి ప్రతీ ఒక్కరితో కొట్లాటలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. తద్వారా తాను తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం పోరాడుతున్న వీరుడుగా బాగానే బ్రాండింగ్ చేయించుకున్నారు.

కానీ ఆయన కొట్లాటల కారణంగానే తెలంగాణ అభివృద్దికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయసహకారాలు నిలిచిపోయాయి లేదా గణనీయంగా తగ్గిపోయాయి.

ADVERTISEMENT

ఆయన కయ్యాల వలన తెలంగాణ నష్టపోతుంటే, మంచి వాక్చాతుర్యం ఉన్న కేసీఆర్‌ దానినీ ‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష’గా చూపుతూ తన కీచులాటలని కంటిన్యూ చేసేవారు.

ఒకవేళ అయన నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నట్లయితే కేంద్రంతో కొట్లాటల వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని గ్రహించి, కేంద్రంతో రాజీ పడి ఉండాలి. కానీ తన పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకున్నారు. పైగా ఆయనకు ఇగో అడ్డొచ్చింది!

కనుక కేసీఆర్‌ కయ్యమాడే వైఖరి కారణంగానే పదేళ్ళలో తెలంగాణ మరొక్క విమానాశ్రయం ఏర్పాటు చేసుకోలేకపోయారని చెప్పక తప్పదు.

కానీ ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డికి అలాంటి ఇగో లేదు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరమని తెలుసు. కనుక ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రుల పట్ల చాలా వినయంగా సఖ్యతగా వ్యవహరిస్తూ, నిధులు, ప్రాజెక్టులు, వాటికి అనుమతులు రాబట్టుకోవడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ ఇప్పుడు మరో కొత్త (పాత) సమస్య ఏర్పడింది. అదే బిజేపి-కాంగ్రెస్‌ పార్టీల మద్య బద్ధ వైరం! కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతీరోజూ ప్రధాని మోడీని విమర్శిస్తూ, ఆక్షేపిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారంటూ కత్తులు దూస్తూనే ఉన్నారు.

ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్‌, బిజేపిల మద్య తరచూ చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీకి కేంద్రం తెర వెనుక సయం అందిస్తోందని తెలంగాణ సిఎం గుర్రుగా ఉన్నారు. కనుక అవి కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూనే ఉంటారు.

కనుక తెలంగాణ అభివృద్ధికి సహకరించి తమ బద్ద శత్రువైన కాంగ్రెస్‌ పార్టీకి ఆ క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి? అని కేంద్ర ప్రభుత్వం భావించడం సహజమే.

ఈ బద్ద వైరం వల్లనే సిఎం రేవంత్ రెడ్డి గత రెండేళ్ళుగా వరంగల్‌ మమునూరు, భద్రాద్రి కొత్తగూడెం విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే ఉండి పోయింది!

ఈ నేపధ్యంలో చూస్తే ఏపీలో భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు అతి త్వరలో పూర్తికాబోతున్నాయి. రాష్ట్రానికి పలు భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, అమరావతికి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు వగైరా తరలివస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఎందువల్ల?అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు కలిగి ఉండటమే. సిఎం చంద్రబాబు నాయుడు ఇగోలు పక్కన పెట్టి ప్రధాని మోడీ ఇగోని సంతృప్తి పరుస్తుండటమే!

ఏపీలో ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీడీపి తరపున ఒకరిద్దరు కేంద్ర మంత్రులు తప్పక ఉంటారు. కనుక వారిని కూడా సిఎం చంద్రబాబు నాయుడు తెలివిగా ఉపయోగించుకుంటూ ఏపీని అభివృద్ధి చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు-కేసీఆర్‌కి ఉన్న మరో తేడా ఇదే!

ఇదివరకు కేసీఆర్‌ వైఖరి వల్ల, ఇప్పుడు కాంగ్రెస్‌-బిజేపి శత్రుత్వం వల్ల తెలంగాణ నష్టపోతూనే ఉంది. ఇది నిజం కాదనుకున్నా ఈ రాజకీయ వైరం కారణంగానే తెలంగాణ అభివృద్ధి జరగాల్సినంత వేగంగా జరగడం లేదని చెప్పక తప్పదు.

మామునూరు, భద్రాద్రి విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలంటూ సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ నేడు ఢిల్లీలో పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రైల్వే స్టేషన్‌ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో కూర్చొని చర్చిస్తుండటమే ఇందుకు నిదర్శనం… కాదా?

ADVERTISEMENT
Latest Stories