ఏపీలో ఏమి జరిగినా టిడిపీదే బాధ్యత!

Ambati-Rambabu TDP Is Resposible for All Things in APఅవును. ఆంద్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు జరిగినా, పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయినా, మాస్ కాపీయింగ్ జరిగి, ప్రభుత్వోపాధ్యయులు జైలుకి వెళ్ళినా, రోడ్లపై గుంతలు పడినా, చివరికి ఊళ్ళో పశువులు గడ్డి మేయకపోయినా అన్నిటికీ ఇంతకు ముందు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీయే బాధ్యత వహించాలని వైసీపీ మంత్రులు వాదిస్తున్నారు. వాదించడమే కాదు టిడిపీ నేతలపై కేసులు బనాయించి కోర్టుల చుట్టూ కూడా తిప్పుతున్నారు.

తాజాగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరో కొత్త విషయం కనిపెట్టారు. ఆనాడు మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇద్దరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలననే తాము అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్వ్ దెబ్బ తిందని, అందుకే పోలవరం నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు.

ADVERTISEMENT

పెద్ద ప్రాజెక్టులలో కొన్నిసార్లు సాంకేతిక లోపాలు, తప్పిదాలు జరుగుతుండటం సహజమే. ఆ కారణంగా ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప పనులు నిలిపివేసి గత ప్రభుత్వాలను తిడుతూ కాలక్షేపం చేయడం వలన ఉపయోగం ఏమీ ఉండదు. పైగా పనులు ఆలస్యం అవుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం ఇంకా పెరిగిపోతుందని అందరికీ తెలుసు.

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి, ఇంతకంటే చాలా క్లిష్టమైన సమస్యలను, సవాళ్ళను, చివరికి 144 కోర్టు కేసులను కూడా ఎదుర్కుంటూనే అన్ని పనులను మూడేళ్ల పూర్తి చేసి రాష్ట్రంలో నీళ్ళు పారిస్తోంది. దాని ప్రారంభోత్సవానికి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

కానీ చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేకపోయిన పోలవరం ప్రాజెక్టును మేము పూర్తి చేసి చూపిస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ ప్రభుత్వం, మూడేళ్లైన పూర్తిచేయకపోగా డయాఫ్రం వాల్వ్ దెబ్బ తిన్నందున పనులు నత్తనడకన జరుగుతున్నాయని, దానికీ చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపిస్తుండటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చేతకాక మద్దిల వోడన్నట్లుంది ఇది.

మూడేళ్ల తరువాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడుని నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు కనుక మిగిలిన ఈ రెండేళ్ళలో పోలవరం పూర్తవుతుందని అనుకోనక్కరలేదు కూడా.

ఇక వైసీపీ నేతల నోట తరచూ వినిపించే మరో మాట పచ్చ మీడియా. మీడియా ప్రభుత్వ విధానాలలో తప్పులను ఎత్తిచూపుతుంటే దానికి ఏదో ఓ రంగు వేసి, దుష్ట చతుష్టయం అని ముద్ర వేసేసి చేతులు దులుపుకుంటే, తప్పులన్నీ ఒప్పులయిపోవు కదా?

ఇప్పుడు పచ్చ మీడియా అని నిందిస్తున్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, హెలికాఫ్టర్ వేసుకొని రామోజీ సిటీకి వెళ్లి అదే రామోజీరావు ముందు చేతులు కట్టుకొని ఎందుకు కూర్చొన్నారు? అసలు ఆయన వద్దకు ఎందుకు వెళ్ళారో అంబటి రాంబాబు చెప్పగలరా?

ఏ ప్రభుత్వం నుంచైనా ప్రజలు ఆశించేది ఒక్కటే. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తాము ప్రభుత్వంపై ఆధారపడకుండా సుఖంగా జీవించేలా చేయాలని. మరి వైసిపీ ప్రభుత్వం ప్రజల ఈ ఆకాంక్షలను అర్ధం చేసుకొనే పనిచేస్తోందా? అంటే అమరావతిని చూస్తే లేదనే అర్థమవుతుంది. కనుక మిగిలిన ఈ కొద్దిపాటి కాలంలోనైనా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని పనిచేస్తే అదే పదివేలు.

ADVERTISEMENT
Latest Stories