కల్తీ నెయ్యి: బాబాయ్-గొడ్డలి స్టోరీలా సాగితే!

Tirumala Ghee Controversy Sparks Political Clash

వైసీపీ హయంలో తిరుమల స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు సీబీఐ-సిట్‌ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పుడు ఈ అంశంపై చర్చకు వైసీపీ భయపడాలి. కానీ దీనిపై చర్చ జరపాలని మండలిలో వైసీపీ సభ్యులు పట్టుబడుతుంటే, కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ వ్యవహారంలో ఇందాపూర్ డెయిరీని సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీతో ముడిపెట్టి వైసీపీ రాజకీయాలు చేస్తున్నప్పుడు, వారిని టీడీపి ధీటుగా ఎదుర్కోవాలి.

ADVERTISEMENT

హెరిటేజ్ డెయిరీ పేరు ప్రస్తావిస్తూ దాంతో సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైసీపీ మరక అంటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ మరక అంటుకోకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే వైసీపీ పదేపదే ఈ ఆరోపణ చేస్తూ తిరుమలకి హెరిటేజ్ సంస్థే కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని ప్రజలను నమ్మించే ప్రమాదం ఉంటుంది కదా?

శాసనసభకు మొహం చాటేస్తున్న వైసీపీ, మండలిలో పదేపదే హెరిటేజ్ పేరు ప్రస్తావిస్తుండటం యాదృచ్చికం కానే కాదు. న్యాయస్థానంలో ఈ కేసుతో ఎలాగూ కబాడీ ఆడుకోగలదు. కనుక ఈ కేసు గురించి వైసీపీకి ఏ చింతా లేదు.

కానీ ఈ వ్యవహారంలో ఏదో ఓ కట్టుకధ అల్లైనా సరే సిఎం చంద్రబాబు నాయుడుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురైనప్పుడు తాను ఎన్నికల హడావుడిలో ఉండి పట్టించుకోలేదని, దాంతో ఆ హత్యని తనకు అంటగట్టేసిందని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకున్నారు. వైసీపీ చేసిన ఆ దుష్ప్రచారం వలన దానిపై పడాల్సిన ఆ గొడ్డలి వేటు తమపై పడిందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

కనుక ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూడా ‘బాబాయ్-గొడ్డలి వేటు’లా వైసీపీ వాడుకుంటే, వచ్చే ఎన్నికలలో కూటమి భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. కనుక గోటితో పోయేదానిని గోటితోనే ముగించాలి కానీ ‘గొడ్డలి’ వరకు తెచ్చుకోకూడదు కదా?

ADVERTISEMENT
Latest Stories