తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం అమరావతికి వచ్చి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గతంలో అయన టీడీపిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పనిచేసేవారు.
రాష్ట్ర విభజన తర్వాత మొదట బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు అయనని సాదరంగా ఆహ్వానించారు.
అయన మూడు ప్రతిపాదనలతో వచ్చారు. 1. తిరుమల కొండపై తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయింపు, 2. భద్రాచలం సమీపంలో ఏపీలో గల 5 గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయాలి. 3. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గల పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు మరమత్తులకు ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయింపు.
ఈ మూడు ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తెలుపుతానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఈ మూడింటి మొదటి రెండింటికీ అంగీకారం తెలిపినా, నిరాకరించినా సమస్యలు, విమర్శలు తప్పవు.
తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే, ఇతర రాష్ట్రాలు కూడా తమకీ కేటాయించాలని కోరవచ్చు. కొండపై ‘తెలంగాణ భవన్’ కేవలం స్వామివారి దర్శనాలకు వచ్చే వీఐపీలు, భక్తులకు పరిమితమైతే పర్వాలేదు. కానీ అక్కడా ‘జై తెలంగాణ’అంటూ రాజకీయాలు చేస్తేనే ఇబ్బంది.
ఒకవేళ స్థలం కేటాయిస్తే వైసీపీ విమర్శలు భరించక తప్పదు. రేవంత్-బాబు కుమ్మక్కుకి ఇదే నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించవచ్చు. ఇవ్వకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు ఎలాగూ తప్పవు.
రెండో ప్రతిపాదన విషయంలో కూడా ఇలాంటి రాజకీయాలే జరిగే అవకాశం ఉంది. మూడో ప్రతిపాదనలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి సమీపంలో గల ఏపీ గ్రామాలకు కూడా నీరు అందుతోంది. కనుక ఈ ప్రాజెక్టు మరమత్తులకు ఏపీ ప్రభుత్వం నిధులు అందించడం మంచిదే. కనుక తెలంగాణ మంత్రి చేసిన ఈ మూడు ప్రతిపాదనలపై సిఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.




