జగన్ తన తండ్రి సమాధిని పునాదిగా చేసుకొని ఎంతో శ్రమించి వైసీపిని నిర్మించుకున్నారు. మరెంతో పట్టుదలగా కృషిచేసి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఓ భవనం నిర్మించడం చాలా కష్టం కానీ కూల్చడానికి కొన్ని గంటలు చాలు. అదేవిదంగా తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంతో వైసీపి ఇప్పుడు కుప్ప కూలిపోతోంది.
జగన్ హిందూ వ్యతిరేకి అనే భావన తెలుగు ప్రజలలో ఎప్పటి నుంచో ఉంది. ఈ వ్యవహారంతో అది మరింత బలపడింది. దేశవ్యాప్తంగా కోట్లాది హిందువులు కూడా ఇప్పుడు జగన్ని విలన్గా భావిస్తున్నారు. దేశ ప్రజలు ఏమనుకుంటే జగన్కేమి నష్టం అంటే… ప్రత్యక్షంగా అయితే ఏమీ ఉండదు.
కానీ ఈ హిందూ వ్యతిరేక ముద్ర బలంగా పడటంతో ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా జగన్కి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవలసిందే. లేకుంటే ఉత్తరాదిన బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.
నిజానికి ఈ భయంతోనే ఎన్డీయేలోకి వైసీపిని బీజేపీ అనుమతించలేదు. ఏపీలో పొత్తులకి జగన్ సిద్దపడ్డా బీజేపీ అంగీకరించలేదనే విషయం అందరికీ తెలిసిందే.
ఇక దేశంలో ముస్లిం ఓటు బ్యాంక్ని, లౌకికవాద పార్టీ అనే ముద్రని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విషయాలలో చాలా ఆచితూచి స్పందిస్తుంటుంది. కానీ తొలిసారిగా రాహుల్ గాంధీ స్పందిస్తూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఖండించి దర్యాప్తు జరిపించాలని ట్వీట్ చేశారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఉత్తరాది రాష్ట్రాలలో కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించి వారికి దగ్గరయ్యేందుకు లేదా వారిని దూరం చేసుకోలేకనే!
ఇప్పుడు జగన్ గురించి మళ్ళీ రెండు ముక్కలు చెప్పుకోక తప్పదు. ఎన్నికలలో ఒంటరిగా పోరాడటమే చాలా గొప్ప విషయమన్నట్లు, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే రాజకీయ వ్యభిచారమే అన్నట్లు జగన్ మాట్లాడేవారు. ఇప్పుడు వైసీపికి అదే శాపంగా మారింది.
బీజేపీ ఎలాగూ తోడుగా రాదు. కనుక జగన్ మెల్లగా కాంగ్రెస్తో చేతులు కలపాలనుకుంటే ఇప్పుడు ఈ వివాదం కారణంగా కాంగ్రెస్ కూడా దూరం పెడుతుంది.
ఈ క్లిష్ట పరిస్థితులలో జగన్కి అండగా నిలబడేందుకు కేసీఆర్ కూడా ముందుకు రావడం లేదు. వస్తే బండి సంజయ్ వంటివారు తెలంగాణలో హిందూ ఓటు బ్యాంక్ కొల్లగొట్టేస్తారు. కనుక బిఆర్ఎస్ పార్టీ ‘సైలంట్ మోడ్’లోకి వెళ్ళిపోయింది.
మరోపక్క ఆంధ్రాలో టిడిపి, జనసేన, బీజేపీలు ఎలాగూ జగన్కి శత్రువులే. ఇప్పుడు హిందువులని కూడా జగన్ శత్రువులుగా మార్చుకున్నారు.
ఈ వ్యవహారంతో లాభపడింది టిడిపి, చంద్రబాబు నాయుడే అని అందరూ అనుకోవచ్చు. రాజకీయ కోణంలో చూస్తే కొంతవరకు అది నిజమే. కానీ ఈ వ్యవహారంతో ఆయన కంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ఎక్కువ మేలు కలిగిందని చెప్పవచ్చు.
జగన్మోహన్ రెడ్డి వైసీపిని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తే తన పరిస్థితి ఏమిటని వైఎస్ షర్మిల ఇంతకాలం ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఒక్క దెబ్బతో రాహుల్ గాంధీయే స్వయంగా జగన్కి కాంగ్రెస్ తలుపులు మూసేశారు. కనుక ఇకపై ఆమె ప్రశాంతంగా ఏపీలో రాజకీయాలు చేసుకోవచ్చు. తిరుపతి వెంకన్న లడ్డూనా మజాకా?




