రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు రాష్ట్ర రాజకీయ పార్టీల విమర్శలు, ఆయా పార్టీల నాయకుల రాజకీయ ఆరోపణలు, వాటి మీద తెలుగు మీడియా విశ్లేషణలు, చర్చోపచర్చలు, హాట్ హాట్ డిబేట్లు సాగుతూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇటు సోషల్ మీడియా మొత్తం హీట్ ఎక్కుతూ ఉండేది.
కానీ గత వారం నుంచి కూడా అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో రాజకీయ వార్తల స్థానంలో సినీ సెలబ్రెటీల వివాహ వేడుకలు ప్రేక్షకులకు కనివిందు చేస్తున్నాయి. వారి అభిమానులకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాయి. దీనితో బుల్లితెర ప్రేక్షకులకు రాజకీయ వార్తల నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది.
ముందుగా అర్జున్ రెడ్డి మూవీ తో యూత్ లో ఒక స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహం గురించి ప్రస్తావించుకుంటే, ఫిబ్రవరి 26, 2026 న ఉదయపూర్ లోని ఒక ఐలాండ్ లో మొదలైన వీరి పెళ్లి వేడుకలు ఆ తరువాత విజయ్ తన సొంతూరైన నాగర్ కర్నూల్ లో నూతన గృహప్రవేశం తో పాటుగా సత్యనారాయణ వ్రతం తో ఒక ఘట్టం ముగించారు.
ఇక ఆ తరువాత ఫాన్స్ మీట్, మీడియా మీట్ అంటూ సందడి చేసారు. చివరిగా ఈ నెల 4 న హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ తాజ్ హోటల్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని ఇక తమ పెళ్లి వేడుకలకు శుభం కార్డు వేశారు. ఇలా విరోష్ జోడిల వివాహ వేడుకలతో, అక్కడికి వచ్చిన సెలబ్రెటీల ఫోటో షూట్లతో అటు మెయిన్ మీడియా ఇటు సోషల్ మీడియా మొత్తంగా పెళ్లి కళతో కళకళలాడింది.
అలాగే ఇటు మరోపక్క అల్లు వారింట కూడా పెళ్లి భాజాలు మోగడంతో ముఖ్యంగా హైద్రాబాద్ పెళ్లి శోభను సంతరించుకున్నట్టయ్యింది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ – నయనిక రెడ్డి ల వివాహ వేడుకలు ఫిబ్రవరి 2 న ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలతో మొదలై నిన్న వివాహం తో ముగిసాయి.
అయితే ఈ రెండు వివాహ వేడుకలకు గాను అటు సినీ సెలబ్రెటీలతో పాటుగా ఇటు రాజకీయ రంగ ప్రముఖులు కూడా విచ్చేసి ఇద్దరి జంటలకు తమ ఆశీస్సులు అందించారు. సోషల్ మీడియా మొత్తం ఈ రెండు వివాహ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలతో వీడియోలతో నిండిపోయిందనే చెప్పాలి.
విరోష్ జంట వివాహ వేడుకల నుంచి వారి వేసుకున్న సాంప్రదాయ వస్త్రాలు, ధరించిన బంగారు ఆభరణాలు మీద కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. అలాగే ఇటు అల్లు వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, మెగా ఫ్యామిలీ ముచ్చట్ల వీడియోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి.
ఇలా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార – ప్రతిపక్షాల మధ్య జరిగే వాడి వేడి హాట్ డిబేట్స్ నుంచి ప్రజలకు ఈ వేడుకలతో కాస్త ఉపశమనం లభించినట్టయ్యింది.




