ఉత్తరాంద్రలో చక్కెర మిల్లులకి ఇదేం ఖర్మ?

What is the fate for Sugar Factories in Uttarandraఉత్తరాంద్ర జిల్లాలకి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు నలుగురు మంత్రులున్నారు అయినా మూడు ఉభయ జిల్లాలు ఎందుకు అభివృద్ధి జరుగడంలేదని ప్రజలు ప్రశ్నిస్తుంటే, రాజుగారు-ఏడు చేపల కధ చెప్పినట్లు విశాఖలో రాజధాని రాకుండా టిడిపి, జనసేనలు అడ్డుకొంటున్నాయని, అందువల్లే అభివృద్ధి చెందడంలేదని వాదిస్తుంటారు.

సరే! తమ అసమర్దతకి, వైఫల్యాలకి ప్రతిపక్షాలను జవాబుదారీ చేసి తప్పించుకొంటున్నారు కానీ ఉత్తరాంద్ర జిల్లాలలోని చక్కెర కర్మాగారాలు నడిపించకుండా ఎవరూ అడ్డుకొన్నారు?అనే ప్రశ్నకి నలుగురు మంత్రులు సమాధానం చెప్పరు. నిజానికి వారికి ఇటువంటి సమస్యలపై అవగాహన లేదూ… ఆసక్తి లేదూ. ఎంతసేపు సిఎం జగన్‌ భజన చేస్తుండటం లేదా విశాఖ రాజధాని పేరుతో కాలక్షేపం చేస్తుంటారు.

ADVERTISEMENT

దేశంలో పలు రాష్ట్రాలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీల ఏర్పాటు గురించి ఆలోచించే సమయానికే ఉత్తరాంద్ర జిల్లాలలో విజయనగరం జిల్లా భీమసింగిలో సహకార చక్కెర కర్మాగారం, సీతానగరంలో ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ, సంకిలిలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యాయి. వాటిలో భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారలలో ఏడాది పొడవునా చెరుకు క్రషింగ్ అవుతుండేది. దీంతో విజయనగరం, శ్రీకాకుళం రెండు జిల్లాలో చెరుకు రైతులు 25-30 లక్షల టన్నుల చెరుకు సాగుచేస్తుండేవారు.

అయితే కీలకమైన ఈ రెండు కర్మాగారాలలో యంత్ర పరికరాలు చాలా పాతబడిపోవడంతో వాటి స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మూడున్నరేళ్ళుగా చెపుతున్నారే కానీ వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో తరచూ మరమత్తులకు గురయ్యి చివరికి రెండూ మూతపడ్డాయి.

మంత్రి బొత్స మాటలు నమ్మి మళ్ళీ కర్మాగారం తెరుచుకొంటుందనే ఆశతో చెరుకు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంకిలిలో చక్కెర కర్మాగారం నడుస్తున్నప్పటికీ భీమసింగి, సీతానగరం నుంచి రవాణా ఖర్చులు భరించుకొని అంత దూరం తీసుకువెళ్ళినా లాభం రాకపోగా నష్టపోతున్నారు. ఎస్‌కోట, గజపతి నగరం, కొర్లాం నుంచి సంకిలి చక్కెర కర్మాగారం సుమారు 100 కిమీ దూరంలో ఉంది.

వ్యయప్రయాసలకోర్చి రైతులు అంతదూరం చెరుకు తీసుకువెళ్ళినా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ప్రభుత్వం టన్నుకి రూ.2,780 గిట్టుబాటు ధర ప్రకటిస్తే చెరుకు నాణ్యత బాగో లేదనో మరో కారణమో చెప్పి రూ.2,350 చేతిలో పెడుతున్నారు. రెండు మిల్లులు మూతపడటంతో సంకిలి మిల్లు వద్ద దళారులదే రాజ్యం సాగుతోంది.

దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో చెరుకు రైతులు చెరుకు సాగుచేయడం మానుకోవలసి వస్తోంది. అసలు వేలాదిమంది చెరుకు రైతులకు ఎంతగానో ఉపయోగపడే చెరుకు మిల్లులని ఆధునీకరించకుండా మూసివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంద్ర జిల్లాలకి నలుగురు మంత్రులు ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయకపోగా ఉన్నవి మూతపడినా పట్టించుకోవడం లేదని చెరుకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొర్లాంకి చెందిన కె శ్రీనివాసరావు అనే చెరుకు రైతు ఈ బాధలు, నష్టాలు భరించలేక చెరుకు సాగు మానేశానని చెప్పడం ఉత్తరాంద్ర జిల్లాలలో చెరుకు రైతుల దుస్థితికి అద్దంపడుతోంది. నలుగురు మంత్రులకు రాజకీయాలపై ఉన్న శ్రద్ద జిల్లాలలోని పరిశ్రమల ఏర్పాటు, రైతుల సమస్యలపరిష్కారంపై లేదు కనుకనే అందరికీ తీపి పంచే చెరుకు రైతులకి కన్నీళ్ళు మిగులుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories