చంద్రబాబు నాయుడుని జగన్ ఎంతగా ద్వేషించినా, అసహ్యించుకున్నా, విమర్శించినా, వేధించినా ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి కాలేకపోయారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సాధ్యపడనిది అధికారం కోల్పోయి కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేనప్పుడు గొంతు చించుకుంటే ఏమైనా మారిపొతుందా? అంటే కాదని అందరికీ తెలుసు.
మరో 5 ఏళ్ళ పాటు జగన్ వైసీపి నాయకుడుగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఇంత చిన్న విషయం జగన్ అర్ధం చేసుకోకపోవడం ఆ పార్టీకి, ఆయనని నమ్ముకున్నవారికి శాపమే అని చెప్పొచ్చు.
అధికారంలో ఉన్నప్పుడు ఏవిదంగా వ్యవహరించాలో జగన్ ఎలాగూ తెలుసుకోలేకపోయారు. కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఏవిదంగా వ్యవహరించాలో తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ షిక్కటి చిర్నవ్వులు చిందిస్తుండేవారు. కానీ ఇప్పుడు ప్రజల మద్యకు, మీడియా ముందుకు వస్తే చాలా ఆగ్రహంగా, ఆవేశంగా మాట్లాడుతూ ఊగిపోతున్నారు. అది అధికారం లేనందున కలిగిన అసహనం అన్న మాట!
అయితే జగన్ తెలుసుకోవలసిన ఓ ముఖ్య విషయం ఏమిటంటే, మరో 5 ఏళ్ళ వరకు ఎన్నికలు రావు. జగన్ మొదలు కార్యకర్తల వరకు ప్రతీ ఒక్కరినీ కేసుల భయం వెంటాడుతున్నాయి. కనుక పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకోవాలి. ప్రజాసమస్యలపై పోరాడాలి కానీ ఖచ్చితంగా ఈవిదంగా కాదని గ్రహించాలి. ఒకవేళ ఎలా పోరాడాలో తెలియకుంటే గత 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎలా పోరాడారో చూసి నేర్చుకుంటే సరిపోతుంది.
జగన్ గతంలోనూ ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొన్న తర్వాతే ఆయన అసలు విశ్వరూపాన్ని అందరూ చూడగలిగారు. అయితే కుర్చీలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా జగన్ ఇంకా విశ్వరూపం చూపిస్తానంటే దాన్ని చూసి ఎవరూ భయపడరని గ్రహిస్తే మంచిది.
వైసీపి ఓటమికి నేను, నా విచిత్ర ధోరణే కారణమని జగన్ ఎంత త్వరగా గ్రహించి అంగీకరిస్తే అంత మంచిది. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆవేశాన్ని నియంత్రించుకొని మళ్ళీ ప్రజల మనిషి అనిపించుకున్నట్లుగానే, జగన్ కూడా తన విచిత్ర ధోరణిని సమూలంగా మార్చుకోవడం చాలా అవసరం. లేకుంటే ఇదే మెంటాలిటీ, ఇవే మాటలు, ఇవే వ్యూహాలతో జగన్ ముందుకు సాగితే 2029 ఎన్నికలలో వైసీపి గెలవడం సంగతి దేవుడెరుగు… అప్పటికి పార్టీయే ఉండకపోవచ్చు.




