ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను దశాబ్దాల పాటు ఏకచక్రాధిపత్యముగా అధికారాన్ని అనుభవించిన జాతీయ పార్టీ కాంగ్రెస్. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయ్యింది. దానికి తోడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ను తన పార్టీ వైపుకి మళ్లించడంలో వైసీపీ అధినేత వైస్ జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు.
దీనితో ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితి శూన్యమనే చెప్పాలి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపినా ఫలితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే భవిష్యత్ లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసురాగలిగే విధంగా ఏ ఒక్క ఆశ కిరణం కనిపించడం లేదు.
అలాగే ఏపీ లో అధికారం పక్కన పెడితే కనీసం పరువు నిలబెట్టుకునేందుకు కూడా బీజేపీ గజని దండయాత్రలు మాదిరి ఆంధ్రా పై ఎన్నికల యాత్రలు సాగిస్తునే ఉంది. అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన ఏ ఒక్క ఎన్నికలో కూడా కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయింది.
టీడీపీ తో పొత్తులో కారణంగా అధికారంలోకి రావడం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగమవ్వడమే తప్ప బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సొంత బలం శూన్యం. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వచ్చిన ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీ బలోపేతం మీద కనీస శ్రద్ద చూపించలేకపోయారు.
ఇక పార్టీ అధిష్టానం సైతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు వేస్తూ, అందుకు తగ్గ నేతలను బరిలోకి దింపి పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. పొత్తులో ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీ రాజకీయంగా యాక్టీవ్ గా కనిపించకపోవడం, ఇటు వైసీపీ అటు టీడీపీ అంటూ ద్వంద్వ విధానాలతో ముందుకెళ్లడం రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకులుగా మారాయనే చెప్పాలి.
దీనికి తోడు ఏపీలో ప్రాంతీయ పార్టీల హావ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో టీడీపీ ఒకపక్క, వైఎస్ఆర్ చరిష్మా తో, వైస్ జగన్ యాత్రలతో పుట్టుకొచ్చిన వైసీపీ మరోపక్క, ఇక ఓటమిని జయించిన జనసేన ఇలా మూడు పార్టీలు కూడా ఏపీ రాజకీయాలలో తమదైన ముద్ర వేసాయి, వేస్తున్నాయి.
దీనితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం, బీజేపీ భవిష్యత్ కి రాజకీయ భరోసా అనేది అందని ద్రాక్షేనా అన్న అనుమానాలు రోజురోజకి బలపడుతున్నాయి.






