ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడు తగ్గాలో కూడా తెలిసినవారు కేసీఆర్. అందుకే ఎవరేమనుకున్నా గత 7-8 నెలలుగా ఫామ్హౌస్లో రాజకీయ అజ్ఞాతవాసం చేస్తున్నారు.
అలాగని ఆయనేమీ చేతులు ముడుచుకు కూర్చోలేదు. ఫామ్హౌస్లో కూర్చోనే కూతురు కల్వకుంట్ల కవితని జైలు నుంచి విడిపించి ఇంటికి తెచ్చుకున్నారు. ఎలాగూ కాస్త ఖాళీ దొరికిందని ఫామ్హౌస్లో యజ్ఞాలు యాగాలు చేసి గ్రహాలని అనుకూలంగా తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే హైడ్రా గుర్రమెక్కి దూసుకు వస్తారని టాక్!
కేసీఆర్ విరాట పర్వం ముగించుకొని బయటకు రావడానికి ఇంకా టైమ్ ఉంది కనుక అది అప్రస్తుతం. ఆలోగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన పదిమంది బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ హెచ్చుతగ్గులు గురించి నాలుగు ముక్కలు చెప్పుకొందాం.
ఎమ్మెల్యేలని ఫిరాయింపజేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ, రాజ్యాంగాన్ని చేశారంటూ కేటీఆర్, హరీష్ రావుల చేత కొన్ని పంచ్ డైలాగులు చెప్పించారు. ఆ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా లేదా?అంటూ శాసనసభ స్పీకర్ని, హైకోర్టుని పిటిషన్లు వేసి నిలదీయించారు.
అంత హడావుడి చేసి ఇప్పుడు వారిరువురూ ఆ విషయం గురించి అసలు మాట్లాడటమే లేదు!
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించే విషయంలో కేసీఆర్ హటాత్తుగా వెనక్కు తగ్గారు? అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడు తగ్గాలో కూడా తెలిసినవారు కనుకనే అని చెప్పుకోవలసి ఉంటుంది.
ఇప్పుడు పట్టుబట్టి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేస్తే వెంటనే ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగి, వాటిలో కూడా ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీకి స్వయంగా సమాధి కట్టుకొన్నట్లవుతుంది. అందుకే వెనక్కు తగ్గారు.
ఫామ్హౌస్లో కేసీఆర్ చేసిన యజ్ఞయాగాల వల్లనో ఏమో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే హైడ్రాతో కోలుకుంటోంది. రాబోయే మూడు నాలుగు నెలల్లో హైడ్రా మరిన్ని ఇళ్ళు కూల్చివేయడం ఖాయం. అప్పుడు ప్రజలు మళ్ళీ కేసీఆర్కి, బిఆర్ఎస్ పార్టీకి జై కొట్టడం ఖాయం.
అప్పుడు ఉప ఎన్నికలు జరిగి 10కి కనీసం 6-7 స్థానాలు గెలుచుకున్నా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ వేగంగా పుంజుకోగలదు. బహుశః అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్, హరీష్ రావు అడగడం మరిచిపోతున్నారేమో?




