ప్రభుత్వం పాలన బాగోలేదు. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు… అని ఓ ప్రతిపక్ష నేత నమ్మకంగా చెబుతున్నప్పుడు ఏం చేయాలి? నేరుగా ప్రజల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పి ఓదార్చి వారి సమస్యలను ప్రభుత్వం గుర్తించేలా చేయాలి.
ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్… వారి పార్టీల నేతలు ఇలాగే చేశారు. అదే ప్రజాస్వామ్య పద్ధతి.
కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న జగన్, తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో ప్రెస్మీట్లు పెట్టి తన ఈ వాదనలు వినిపిస్తున్నారు! ఈరోజూ ఆలాగే వినిపించారు.
సిఎం చంద్రబాబు నాయుడికి పాలన చేత కాదని జగన్ గుర్తించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నాయని గుర్తించారు. కనుక ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ లభించదు.
కనుక శాసనసభకు వెళ్ళి సిఎం చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేయవచ్చు కదా? కానీ హోదా లేదు కనుక వెళ్ళడం లేదు!
కానీ ప్రజల వద్దకు వెళ్ళేందుకు ఏ హోదా అవసరం లేదు కదా? ప్రెస్మీట్లో చెప్పే ఆ నాలుగు ముక్కలు ప్రజల వద్దకు వెళ్ళి చెబితే ఆయనకు, వైసీపీకి వారి మద్దతు లభిస్తుంది కదా? మరి తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లతో ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు? అనే సందేహం కలుగుతుంది.
ప్రాణ భయమా? అంటే కానేకాదు… ఎందుకంటే లోపల ఉన్నా బయటకొచ్చినా ‘రప్పా రప్పా’ అని బెదిరిస్తూనే ఉన్నారు.
ఒకవేళ ప్రాణ భయమున్నా జగన్ ప్యాలస్ నుంచి కాలు బయటపెడితే చాలు… వేలాదిగా ప్రజలు తరలి వచ్చి జేజేలు పలుకుతుంటారు. వేలాదిమంది అభిమానులు ఆయన కారు వెంట పరుగులు తీస్తుంటారు… అని వార్తలు, ఫోటోలు, వీడియోలు వైసీపీ సొంత మీడియాలో, సోషల్ మీడియాలో అచ్చేసుకుని మరీ చెబుతుంటాయి కదా? చుట్టూ ఇంతమంది ‘రప్పా రప్పాలు’ ఉండగా ఇక సింహానికి భయమెందుకు?
ఒకవేళ ప్రాణ భయం కాదు… వేరే కారణాలు ఉన్నాయనుకున్నా, ఇలా ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు దూరంగా తాడేపల్లి ప్యాలస్లో ఒంటరిగా కాలక్షేపం చేస్తుంటే, ‘మళ్ళీ మనమే’ అంటే ఎవరైనా ఎలా నమ్మగలరు?
చిన్నా పెద్దా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఖచ్చితంగా ముందే డేట్ ప్రకటిస్తారు. ఒకవేళ వాయిదా పడిన మరో డేట్ ప్రకటిస్తారు. కానీ తాడేపల్లి ప్యాలస్ నుంచి జగన్ రిలీజ్ డేట్ ఎప్పుడు?






