ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు మిన్నా అన్నట్లుగా ఎప్పుడో రాజకీయ ప్రవేశం చేసిన కేసీఆర్ కన్నా మొన్నిఈమధ్యన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ చాల చురుకుగా రాజకీయాలు నడుపుతున్నారు. ఓడినా, గెలిచినా ఎప్పుడు ఎదో ఒక రకంగా వైసీపీ పార్టీ పేరు వినిపించేలా, జగన్ జాడ కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు.
2023 తెలంగాణలో జరిగిన ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి మార్పు మంచిది కాదని తెలియచెప్పింది. దీనితో పదేళ్ల తెరాస హవాకు, కేసీఆర్ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయి. తెలంగాణ తెచ్చినోడు కాదు తెలంగాణ ఇచ్చినోడికి ఒక అవకాశం ఇవ్వాలని మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠం కట్టబెట్టారు తెలంగాణ వాసులు.
అయితే మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటే, 39 స్థానాలతో బిఆర్ఎస్ సర్దుకుంది. ఇందులో బీజేపీ 8, MIM 7, సిపిఎం 1 స్థానంలో తన జెండా ఎగేరేసింది. అయితే బిఆర్ఎస్ కన్నా తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ కూడా ప్రభుత్వం మీద తన దూకుడు చూపిస్తూ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటుంది.
ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా గుర్తింపు పొందిన కేసీఆర్ మాత్రం ఒక్క ఓటమితో కుంగిపోయారనే చెప్పాలి. ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క విషయంలోనూ కేసీఆర్ ముందుకొచ్చి ప్రజలకు మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందే లేదు. పార్టీ తరుపున నిర్వహించే ఏ కార్యక్రమాలలోను కేసీఆర్ పాలుపంచుకోవడం లేదు.
అన్నిటిని కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు చేతికి అప్పగించి కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇన్నాళ్ళుగా కూతురు కవిత కోసం కేసీఆర్ మౌనం వహిస్తున్నారు అనుకున్న వారి ఆలోచనలను కూడా కేసీఆర్ పటాపంచలు చేస్తున్నారు. లిక్కర్ స్కాం లో అరెస్టయిన కవిత బైలు మీద బయటకు కూడా వచ్చేసారు. అయినా కేసీఆర్ గడప దాటటం లేదు.
గడిచిన ఆరు నెలల నుంచి ప్రజా సమస్యల మీద మౌనం వహించిన కేసీఆర్ ఇప్పుడు కనీసం పార్టీ సమస్యల మీద కూడా స్పందించడం లేదు. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం మీడియాకెక్కి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి రచ్చ లేపుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం తనకేమి పట్టనట్టు గమ్మున ఉండిపోయారు.ఇన్నాళ్లు కేసీఆర్ ను దొర అన్న నేతలు సైతం ఇప్పుడు కేసీఆర్ దాక్కుంటున్నారు అని హేళన చేస్తున్నారు.
ఈ విషయంలో కూడా హరీష్ రావే పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ కౌశిక్ ఇంటి మీద జరిగిన దాడి ఘటనకు నిరసన తెలియచేసారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు తో సహా పలువురు బిఆర్ఎస్ నాయకుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ అరెస్టుతో హైద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసులు అరెస్టు చేసిన బిఆర్ఎస్ నేతలను బస్సులో కేసంపేట పీఎస్ కు తరలించారు. మార్గ మధ్యలో బిఆర్ఎస్ శ్రేణులు బస్సుని అడ్డుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగి ముఖ్యమంత్రి రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేసారు. దీనితో ఇరు వర్గాల మధ్య దోపులాట జరగడంతో హరీష్ రావు భుజానికి గాయం అయినట్లు తెలుస్తుంది.
ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం తన మౌన ముద్ర వీడలేదు. కేసీఆర్ తో పోలిస్తే ఏపీలో వైస్ జగన్ తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ చాల వేగంగా రాజకీయ అడుగులు వేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ బలం 151 నుంచి 11 కి పడిపోయినా జగన్ మాత్రం ఎక్కడా తగ్గేదెలా అన్నట్టుగా ప్రకృతి విపత్తుని కూడా తన రాజకీయ లబ్ది కోసం వాడుకుంటూ నిత్యం మీడియాలో హడావుడి చేస్తున్నారు.
అలాగే నాలుగు రాళ్ళేసి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తప్పేముంది అంటూ తన పార్టీ నేతలు చేసిన దాడులను సైతం వెనకేసుకొచ్చి అరెస్టయిన వైసీపీ నాయకులను పరామర్శించడానికి జైళ్ళ చుట్టూ తిరుగు ఓదార్పు యాత్రలు చేస్తూ పార్టీ నేతలకు కూడా భరోసా కల్పిస్తున్నారు.
ఒక పక్క నుంచి సొంత చెల్లి వైస్ షర్మిల నుండి ఎదురుదాడి ఎదుర్కొంటు కూడా కూటమి ప్రభుత్వ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఒకరకంగా చూస్తే జగన్ తో పోలిస్తే కేసీఆర్ పార్టీకి సొంత రాష్ట్రంలో బలం ఎక్కవే. అయినా కేసీఆర్ బలహీనపడిపోయారు.
అలాగే జగన్ తో పోలిస్తే కేసీఆర్ మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసులు లేవు, అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు లేవు. కానీ జగన్ అవన్నీ మోస్తూ కూడా ఇంకా రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటున్నారు. దీనితో కేసీఆర్ కి జగన్ రాజకీయాలు నేర్పలేమో అన్న అభిప్రాయం వినపడుతుంది.




