ఏపీ రాజధాని నిర్మాణంలో మంత్రి నారాయణ కీలకపాత్ర వహిస్తున్నారు. భూసేకరణ, పనుల పురోగతి, పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటారు.
అటు కాంట్రాక్ట్ కంపెనీలతో, ఇటు ముఖ్యమంత్రితో, తన మున్సిపల్ మంత్రిత్వ శాఖలో వరుస సమావేశాలు అవుతుంటారు. ఇలా ఒక్కటా రెండా… ఏకకాలంలో ఆయన చాలా పనులు చక్కబెడుతున్నారు. కనుక సకాలంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తయితే ఆ క్రెడిట్ ఆయనకే సొంతం అని చెప్పవచ్చు.
గత ప్రభుత్వంలో కూడా మంత్రి నారాయణ రాజధాని భూసేకరణలో కీలకపాత్ర పోషించారు. కానీ అదే ఆయనకు తీరని అప్రదిష్ట, అవమానాలు మిగిల్చింది.
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన భూసేకరణలో అవినీతి అక్రమాలకూ పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. ఆయన, బంధుమిత్రులు బినామీలు కలిసి నామ మాత్రపు ధరల్లో వందల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించింది.
నారాయణ విద్యాసంస్థల ద్వారా పదో తరగతి పరీక్షాపత్రాలు లీక్ చేశారంటూ మరో కేసు పెట్టి వేధించింది. కానీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఒక్క కేసులో కూడా ఆయనను దోషిగా నిరూపించలేకపోయింది. కానీ వైసీపీ ఆయన ప్రతిష్టకు భంగం కలిగించ గలిగింది. అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేసింది.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ గాలికి కొట్టుకుపోయినట్లు పోయాయి. ఇదివరకు మొదలుపెట్టిన అమరావతి పనుల విషయంలో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కనుక సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి బాధ్యత ఆయనకే అప్పగించారు. కనుక అప్పటి నుంచి ఆయన మూడేళ్ళ గడువు పెట్టుకొని రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా చేయిస్తున్నారు.
ఈసారి కూడా అమరావతి విస్తరణ కొరకు ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ బాధ్యతలు ఆయనకే అప్పగించింది. భూసేకరణ చేసేవారు ఎవరైనా పాపాల భైరవుడే అవుతారు. అటు రైతులు, ఇటు ప్రతిపక్షం ఆయననే నిందిస్తుంది.
కనుక ఈసారి ఆయన మరింత అప్రమత్తంగా వ్యవహరించకపోతే, ఈ భూసేకరణ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలలో కూటమి పార్టీలపై పడే ప్రమాదం పొంచి ఉంటుంది.
కాబట్టి అమరావతి నిర్మించడమే కాదు… కూటమి ప్రభుత్వం ఓడిపోకుండా మళ్ళీ గెలిపించుకునే బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. వచ్చే ఎన్నికలలోగా అమరావతికి రూపురేఖలు తెచ్చి ప్రజల ముందుంచడమే ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం!






