బడా రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాల నుంచి ఉన్న రాజకీయ నాయకుల మీద వేసే అవినీతి కేసులు, అక్రమాల ఆరోపణలు, జరిగిన అరెస్టులు కాలం గడిచే కొద్ది బైళ్ల రూపంలో నీరు కారిపోవాల్సిందేనా.? ఇటువంటి రాజకీయ నాయకుల బైళ్లకు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉండదా.?
ఉదాహరణకు జగన్ అక్రమాస్తుల కేసు విషయమే తీసుకుంటే, ఈ కేసులో అరెస్టయిన జగన్ దాదాపు 16 నెలలు జైలు జీవితం అనుభవించి అటు పిమ్మట బైలు మీద బయటకొచ్చారు. అయితే జగన్ కు బైలు వచ్చి దశాబ్దం గడిచిపోయినా ఆ బెయిలే ఇప్పటికి జగన్ ను, వైసీపీ రాజకీయాన్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తుంది.
ఈ కవచంతోనే జగన్ తన కేసుల విచారణ ను సైతం నిర్లక్ష్యం చేస్తూ కోర్ట్ కు కూడా హాజరు కాకుండా, తన తరుపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులతో పనికానిచేస్తున్నారు. మరి ఆయన బెయిలు కి ఎక్స్ పైరీ డేట్ ఎప్పుడు.? అసలు ఉంటుందా.? ఉండదా.?
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం లో భారీ అవినీతి అంటూ నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఉన్న కల్వకుంట్ల కవితను అధికారులు అరెస్టు చేసారు, 6 నెలల పాటు తీహార్ జైల్లో వనవాసం చేయించారు.
అయితే నాడు బైలు మీద బయటకొచ్చిన కవిత నేడు అదంతా గడిచిపోయిన గతంలా, చెరిగిపోయిన చేదు జ్ఞాపకం లా తన రాజకీయ జీవితంలో జైలు లేదు కేవలం బెయిలు మాత్రమే ఉందనేలా అరెస్టు ను బైలు తో చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇప్పటికి ముందస్తు బైళ్లతోనే తన రాజకీయ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగిస్తున్నారు. ఇలా ఈ రాజకీయ నాయకుల అరెస్టులకు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది కానీ వారికీ లభించే బైళ్లకు మాత్రం ఒక ఎక్స్ పైరీ డేట్ ఉండడం లేదు.
అంటే చట్టం “బలవంతులకు బలహీనంగా – బలహీనులకు బలంగా పనిచేస్తుందని” అర్థమా.? లేక చట్టం ముందు అందరు సామానులు కారు అనేదానికి నిర్వచనమా.? ఏదిఏమైనప్పటికీ ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులందరూ ఎటువంటి భయం, బెరుకు లేకుండా ఈ ఎక్స్ పైరీ డేట్ లేని బైళ్లతో తమ రాజకీయ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించగలుగుతున్నారు అనేది సుస్పష్టమవుతుంది.






