అవును! తెలంగాణకు దిగువనున్న ఏపీలో చెరువులో నుంచి చెంబుడు నీళ్లు తీసి వాడుకున్నా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యంతరమే!
ఇదివరకు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించగానే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిపోతోందంటూ మొదట బీఆర్ఎస్ పార్టీ చాలా హడావుడి చేసింది. బనకచర్లతో రాయలసీమకు నీళ్ల తరలింపు సంగతి ఏమో కానీ, ఆ పేరుతో బీఆర్ఎస్ పార్టీ మంచి రాజకీయ మైలేజ్ సంపాదించుకుంది.
తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ పదేపదే విమర్శలు గుప్పించింది.
వాటితో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. తెలంగాణ ప్రయోజనాలను కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడుతుందనే భావన ప్రజలలో ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. కనుక అది కూడా చాలా హడావుడి చేసి బనకచర్లను కాగితాలపైనే నిలిపివేసింది.
ఇంతకీ బనకచర్లతో తెలంగాణకు ఏ విధంగా నష్టం కలుగుతుందో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు చెప్పనే లేదు. నష్టం కలుగుతుంది… అంతే అంటే అంతే!
బనకచర్ల నిలిచిపోవడంతో ఈసారి ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి 200 టీఎంసీ నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల సాగర్కు తరలించాలని పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును చేపట్టాలని అనుకుంది. దీనిపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక (డీపీఆర్) ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
ఈసారి బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది. పోలవరం నుంచి 200 టీఎంసీ నీటిని నల్లమల సాగర్కు తరలించడం బచావత్ ట్రిబ్యునల్కు వ్యతిరేకమని అందులో పేర్కొంది. కనుక ఏపీ ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా స్టే విధించాలని పిటిషన్లో కోరింది.
పోలవరం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన జాతీయ ప్రాజెక్టు. ఇది తెలంగాణకు దిగువన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కనుక పోలవరంలోకి వచ్చి చేరిన నీళ్లు మళ్లీ ఎగువన తెలంగాణకు వెళ్లవు. ఒకవేళ ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వాడుకోలేకపోతే అవి సముద్రంలో కలుస్తాయి.
సముద్రంలో కలిసే ఆ నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకోగలిగితే మంచిదే. కానీ అది సాధ్యపడదు. కనుక ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంది. కానీ దీనిపై కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ లెక్కన ఇప్పుడు ఏపీలో ఎక్కడ ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలన్నా కేంద్రం కంటే ముండుగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు చేసుకుని వాటి అనుమతి పొందాలేమో? లేకుంటే అటు నెల్లూరులోనో, ఇటు శ్రీకాకుళంలోనో ఎవరైనా కొళాయి విప్పినా తెలంగాణలో పాలకులకు, ప్రతిపక్షాలకు అభ్యంతరమే? వెంటనే కేసులు, రాజకీయాలు మొదలైపోతాయన్న మాట!






