ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించింది.
రాష్ట్రంలో ఇంతకంటే తీవ్రమైన అనేక ప్రజా సమస్యలు ఉండగా వైసీపీ దీనినే ఎందుకు భుజానికి ఎత్తుకుంది? ఇప్పటికిప్పుడు దీంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు, దీనిని ఎందుకు ఎంచుకుంది? అసలు దీంతో ఏం సాధిద్దామనుకుంది? అని ఆలోచిస్తే ఆసక్తికరమైన సమాధానాలు లభిస్తాయి.
ప్రభుత్వం–ప్రైవేట్ జాయింట్ మేనేజ్మెంట్లో ఆసుపత్రులు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతుంటే, దానినే వైసీపీ ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ’ అని కొత్త భాష్యం చెబుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు ఉచిత వైద్యం లభిస్తుంది. కానీ వాటిని ప్రైవేటీకరిస్తే లభించదని వైసీపీ వాదిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోనే నిరుపేదలు ఉచితంగా చికిత్స పొందగలుగుతున్నారు. అటువంటప్పుడు, పీపీపీ పద్ధతిలో నిర్వహించే హాస్పిటల్స్లో వైద్యం అందకుండా ఉంటుందా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయినా వైసీపీ ఈ అంశం భుజానికెత్తుకొని ముందుకు సాగిపోతూనే ఉంది. ఎందుకు? అని ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం నేటికీ చాలా బలంగా, చురుకుగా ఉందని ప్రజలు గ్రహించేలా చేయడం కోసమే వైసీపీ ఇంత హడావుడి చేస్తోందనిపిస్తుంది.
కనుక తాము ఎంచుకున్న ఈ అంశం సరైనదా కాదా? దీంతో ప్రజలను ఆకర్షించగలమా లేదా? అనేది ముఖ్యం కాదు. వైసీపీ బలంగా ఉందని ప్రజలను నమ్మించడమే ముఖ్యం. వైసీపీ హడావుడి చూసి ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఇదే జగన్ కోరుకుంటున్నారు.
బిగ్బాస్ షోలో ప్రేక్షకులను అలరించేందుకు రోజూ ఏదో ఒక కొత్త టాస్క్ ఇస్తుంటారు. ఆ షోలో పాల్గొన్నవారు వాటిని రక్తికట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. వైసీపీ చేస్తున్న ఈ ఆందోళనలు కూడా అచ్చం అటువంటివే. ఇందులో బిగ్బాస్ జగన్… ఆంధ్రప్రదేశ్ ప్రజలే వైసీపీ షోకి ప్రేక్షకులు!






