పాఠశాలలో చదువుకునే విద్యార్థుల పాఠ్యపుస్తకాల సిలబస్ కూడా ప్రతి ఐదేళ్లకొకసారి మారుతుంది. అలాగే వినోదానికి తీసే సినిమాలు సైతం ట్రెండ్ కి తగ్గట్టుగా తమ స్క్రిప్ట్ సబ్జెక్టులను మార్చుకుంటూ ముందుకెళ్తాయి.
మరి చిన్న పిలల్లు చదివే పాఠ్య పుస్తకాల నుంచి సినిమాలకు రాసే స్క్రిప్ట్ వరకు నిర్దిష్ట కాలపరిమితిలో మారుతూ ప్రస్తుత సమాజమానికి ఏది అవసరమో అది అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరి ఒక రాజకీయ పార్టీగా లక్షలాదిమందిని ప్రభావితం చేసే ఒక పార్టీ అధినేతగా జగన్ వైసీపీ సిలబస్ ను ఎందుకు మార్చడం లేదు.?
వైసీపీ ఆవిర్భావం నుంచి నేటి పతనం వరకు వైసీపీ సిలబస్ లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. నాటి ఓదార్పు యాత్రలు మొదలు నేటి పరామర్శల పర్యటనలు వరకు, నాటి కోడికత్తి రాజకీయాల నుంచి నేటి రప్ప రప్ప నినాదాల వరకు,
నాటి ఐ ప్యాక్ రాజకీయాల ను నుండి నేటి సోషల్ మీడియా ప్రచారాల వరకు, నాటి విశాఖ నుంచి నేటి అమరావతి వరకు, అలాగే నాటి మూడు పెళ్లిళ్ల నుంచి నేటి దత్తపుత్రుడు వరకు వైసీపీ స్క్రిప్ట్ లో ఏ మార్పు లేదు, అలాగే వైసీపీ సిలబస్ లో ఎటువంటి అప్ డేట్ లేదు.
అవే పాత చింతకాయ తొక్కు వంటి రాజకీయ విమర్శలు, అవే నిటూర్పులు. చంద్రబాబు పై ద్వేషం, పవన్ పై ఉన్న విద్వేషం, లోకేష్ పట్ల పేరుకున్న అసూయ ఇప్పటికి జగన్ కు అదే స్థాయిలో పెరుగుతూ వస్తుందని నేటి జగన్ ప్రెస్ మీట్ చూస్తే యిట్టె అర్డమవవుతుంది.
తాడేపల్లిలోని తన ప్యాలస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మొంథా తుఫాన్ గురించి మాట్లాడిన వైస్ జగన్ ముఖ్యమంత్రి బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ పై వైసీపీ పాత సిలబస్ లోని తిట్లకే పరిమితమయ్యారు. బాబు, పవన్ , లోకేష్ ల పై చీటింగ్ కేసు పెట్టి వీరి ముగ్గురిని బొక్కలో వెయ్యాలని,
పవన్ ని దత్తపుత్రుడని, ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి ని యెల్లో మీడియా అంటూ, దుష్టచతుష్టయం అని, గజదొంగల ముఠా అని, దోచుకో పంచుకో, తినుకో వీరి విధానం అంటూ ఇలా వైసీపీ ఆవిర్భావం నాటి సిలబస్ నే జగన్ ఇప్పటికి కొనసాగిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ వైసీపీ స్క్రిప్ట్ ఏపీలో ని ఏ చిన్న పిల్లాడిని కదిపినా యిట్టె చెప్పగలడు. వైసీపీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా సైన్యం ప్రతి ఒక్కరు ఈ సిలబస్ ను పదేపదే వాడేసారు. కాబట్టి ఈసారి ఎన్నికలకు వైసీపీ కొత్త స్క్రిప్ట్ తో అయినా రావాలి, లేక కొత్త తిట్ల సిలబస్ నైనా మార్చుకోవాలి.
లేకుంటే జగన్ మీడియా సమావేశాల పై సాధరణ ప్రజలకే కాదు చివరికి వైసీపీ శ్రేణులకు సైతం పూర్తిగా ఆసక్తి తగ్గి పోయే ప్రమాదం ఉంది. ఈ ఎల్లో మీడియాలు, దుష్టచతుష్టయాలు, దత్త పుత్రుడు, మూడు పెళ్లిళ్లు, దుర్మార్గులు, దోపిడీ దారులు ఇవి గత పదేళ్ల నుంచి విని విని, తిట్టి తిట్టి వైసీపీ వారికి సైతం విరక్తి పుడుతుంది కానీ జగన్ కు మాత్రం విసుగు రావడం లేదు..వై.?






