దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 37 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వాటికి మార్చి 5 వరకు నామినేషన్ గడువు ఉంది. మార్చి 16న పోలింగ్ జరుగుతుంది. ఏపీలో ఒక్క సీటు కూడా లేదు
కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో 2 సీట్లు, కాంగ్రెస్ మిత్ర పక్షంగా ఉన్న తమిళనాడులో 6 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్, డీఎంకే నేతలే చాలా మంది వాటికి పోటీ పడుతున్నారు. కనుక బయటవారికి అవకాశం లభించడం కష్టం.
వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పుతున్నప్పుడే భవిష్యత్లో రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ రెండున్నరేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వలేదు.
ఇక ఏపీ రాజకీయాలను చూస్తే… 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ 2029 ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చాలా ధీమాగా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా మరో పదేళ్ళు మేమే అధికారంలో ఉంటామని గట్టి నమ్మకంతో ఉంది.
కూటమి ప్రభుత్వం-వైసీపీ మద్య నువ్వా నేనా అన్నట్లు ఈవిధంగా రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతుండటంతో, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు.
కనుక వైఎస్ షర్మిలకి కనుచూపు మేర ఇది తప్ప మరో అవకాశం కనిపించడం లేదు. కనుక కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి తెలంగాణ లేదా మరో రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలని అడిగితే మంచిది. లేకుంటే ‘సాగరసంగమం’లో కమల్ హాసన్లా మిగిలిపోతారు.




