కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో ప్రజలకు కాస్త ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు వినిపించింది. ప్రస్తుతం ఉన్న 2500 విత్ డ్రాలకు తోడుగా మరో 2000 జత చేసి, మొత్తంగా 4500 రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అయితే బ్యాంకుల నుండి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి 24000 రూపాయల విత్ డ్రా పరిమితి కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ నుండి అమలులోకి రాబోతున్న ఈ నిర్ణయంపై ప్రజల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
విత్ డ్రా పరిమితిని పెంచడం కాస్త ఉపశమనం కలిగించే నిర్ణయమే. ఒక రకంగా చెప్పాలంటే… ప్రజలను కరెన్సీ కష్టాల నుండి బయటపడేసే అంశమే. అయితే ఇదంతా ఎప్పుడు… ఏటీఎంలో సరిపడ కరెన్సీ ఉంటే జరిగే విషయం. కానీ ఇప్పటివరకు అయితే దాదాపుగా 90 శాతంకు పైగా ఏటీఎంలు పని చేయడం లేదు. పని చేస్తున్న అరకొర ఏటీఎంలో ఇలా డబ్బు పెట్టగానే అలా రెండు, మూడు గంటలలోనే అయిపోతున్నాయి. 2500 రూపాయల విత్ డ్రాలతోనే రెండు, మూడు గంటల్లో ఏటీఎంలో డబ్బులు నిండుకుంటుంటే, తాజాగా 4500 విత్ డ్రాలతో డబ్బులు పెట్టిన గంట వరకే సదరు ఏటీఏంలు పనిచేస్తాయేమో అంటూ పెదవి విరచడం ప్రజల వంతవుతోంది.
ముందుగా అన్ని ఏటీఎంలో సరిపడ కరెన్సీ పెడితే, 4500 కాదు, 2500 రూపాయలైనా ప్రజలు సరిపెట్టుకునే వారు. దీంతో ఈ పెంపు అనేది కేవలం పేపర్ ప్రకటనలకు తప్ప, ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశమైతే కాదన్నది ఆర్ధిక నిపుణులు కూడా వ్యక్తపరుస్తున్న విషయం. ప్రస్తుత పరిస్థితులలో పని చేస్తున్న 10 శాతం ఏటీఎంలలో 4500 రూపాయలు ఎంతమందికి దక్కేను? ముందుగా ఏటీఎంలలో కరెన్సీ నింపి, ఆర్బీఐ ఈ ప్రకటన చేసినట్లయితే ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేదన్నది నిపుణుల మాట.



