రాను రాను వైసీపీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నోటికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటికే రాజధాని మార్పు అంటూ సగం చంపేసిన అమరావతిని పూర్తి గా నేలమట్టం చేసే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది వైసీపీ ప్రభ్యుత్వం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో నిర్మించిన సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న ఏపీ ప్రభుత్వం చేసిన పనికి కూసంతైనా సిగ్గు పడకుండా ఇంకా ప్రశ్నించిన వారి పై ఎదురుదాడి చేస్తుంది. సచివాలయం అనేది కేవలం 10 ఎకరాల భూమి మాత్రమే. ఎకరా 2 కోట్లు పలికితే మొత్తం 10 పదెకరాలకు గాని 20 కోట్లు ఆస్తి అంటూ వ్యాపార ధోరణే తప్ప ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా పోయింది సదరు నాయకుడికి.
సచివాలయం అంటే 10 ఎకరాల భూమి, రాష్ట్రం అంటే కొన్ని వేల చదరపు కిలోమీటర్లు, పార్లమెంట్ అంటే ఇంకో 25 ఎకరాలు అంతేగా అంటూ ఇలా అంకెలతో ప్రజల మనోభావాలను కొలవచ్చు అని వైసీపీ నిరూపించాలనుకుంటుందా..? అదే పదిఎకరాల సొంత భూమిని తాకట్టు పెట్టి ఏ రాజకీయ నాయకుడైన ప్రభుత్వానికి అప్పు ఇవ్వగలడా..? ప్రభుత్వాన్ని నమ్మి కొన్ని వేల ఎకరాల భూమిని, కష్టార్జితాన్ని ప్రభుత్వ పెద్దలకు దారాదత్తం చేసిన రైతులకు చివరికి మిగిలేదేంటి అంటే పైడ్ ఆర్టిస్టులు అనే బిరుదు, వారి భూములకు సమాధి అనే గౌరవం.
కొన్ని కోట్ల ప్రజల ఆస్తిని అధికారం ఉంది అనే ఒకేఒక్క కారణంతో ఎవరికీ జవాబుదారీ గా ఉండకుండా…. సెక్రటేరియట్ తాకట్టు పెడితే తప్పేంటి..? సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ రాజ్యాగంలో ఏమైనా రాసి ఉందా..? ఇదేమన్నా బాబు గాడి ఆస్తా అంటూ ప్రతిపక్ష నేత పై కనీస మర్యాద లేకుండా కొడాలి నాని చేస్తున్న ఈ పిచ్చి ప్రేలాపనలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి..?
ఇప్పుడు అప్పు కోసం ప్రభుత్వ ఆస్తి అయిన సచివాలయం ను తాకట్టు పెట్టారు. రేపు మరో అవసరానికి హైకోర్టు ను, మరో అవసరానికి ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేస్తారా..? లేక అంబేద్కర్ రాజ్యంగంలో రాసి లేదు కదా అని రాష్ట్రాన్నే అమ్మేస్తారా..? ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే తీరు..? ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే పద్దతి ..? ఇదేనా ప్రజలకు ఇచ్చే వివరణ..? అంటూ ప్రజాస్వామ్య వాదులు గోషిస్తున్నారు.
ఒక్కఛాన్సు ఇస్తేనే సచివాలయం వాడి బాబు దా..? వీడి బాబు దా..? అంటున్న వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే ఏపీ ఎవడి బాబు గాడిది అంటూ తాకట్టు పెట్టరనే గ్యారెంటీ ఏమైనా ఉందా..? పొద్దున్న లేస్తే అమరావతి కాదు ‘కమ్మ’రావతి అంటూ ఒక సామాజిక వర్గం పై దాడి చేస్తూ అధికారం ఉన్నన్నాళ్ళు అక్కడి నిర్మాణాలను ఉపయోగిస్తూ అధికారం చివరాంకలోకి వచ్చాకా తాకట్టు పెడితే తప్పేంటి.? అమ్మేస్తే అడ్డేమిటి..? అంటూ నోరేసుకుని పడిపోతుంటే ఇక ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఏముంటుంది.
ఇదేనా జగన్ చెపుతున్న ‘పేదలకి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం’…,ఇందుకేనా జగన్ ‘వై నాట్ 175 నినాదం’…, దీనికే ‘నువ్వే మా నమ్మకం జగనన్నా’ స్లొగన్స్. ఇలా ఎవరి ఇష్టానికి వారు ప్రజల ఆస్తులను అమ్మేసుకుంటూ, తాకట్లు పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి విలువెక్కడ..? రాజ్యాంగానికి చోటెక్కడ..? ఓటర్ పరిస్థితి ఏమిటి..? ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి బటన్ నొక్కడం వలన రాష్ట్రానికి ఒరిగిందేమిటి..? రాష్ట్ర ప్రజలకు కలిగిందేమిటి..?
మీ భవిష్యత్తుకు ‘నాది గ్యారెంటీ’ అంటూ టీడీపీ నాయకుడు ముందుకొస్తుంటే…’మీ భవిష్యత్తు తాకట్టుకి’ నాది గ్యారెంటీ, రాష్ట్ర ప్రజల ఆస్తుల అమ్మకానికి నాది షూరిటీ అంటూ వైసీపీ నాయకులు ఆలోచించడం ఎంతవరకు సమంజసం..? కళ్ళ ముందు నొక్కుతున్న బటన్లు కోసం ఆశపడి కంటికి కనిపించని రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టుకుంటారా..? ఆలోచించుకోవాలి.
ప్రభుత్వం అంటే వాడి బాబు ది వీడి బాబు ది కాదు సార్. ప్రభుత్వం అంటే ప్రజలు పెట్టిన భిక్ష. ప్రభుత్వం అంటే ప్రజలు నొక్కిన బటన్. ప్రభుత్వం అంటే కొన్ని వ్యవస్థలు మూకుమ్మడిగా కలిసి పనిచేసే ఒక జవాబుదారీ. ప్రభుత్వం అంటే ఆస్తో – అప్పో కాదు ఒక నమ్మకం. ప్రభుత్వం అంటే ఒక భరోసా. ప్రభుత్వం అంటే ఒక పేదవాడి ఆశ. వీటన్నిటిని ఒకే ఒక్క మాటతో నేరల్చారు వైసీపీ నేత కొడాలి నాని.




