జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభను ‘నమస్కారాల పర్వం’తో మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్, ఈ ఎనిమిదేళ్ళల్లో పార్టీ సాధించిన అభివృద్ధి ఏమిటో క్లుప్తంగా తెలిపారు. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 27 శాతం ఓటింగ్ ను జనసేన సొంతం చేసుకుందని, ఇక్కడ నుండి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేటంత ఓటింగ్ శాతం కోసం జనసైనికులు కృషి చేయాలని కాంక్షించారు.
దాదాపుగా ఇలా ఓ అరగంట సేపు ప్రసంగించిన తర్వాత, ఇంకా నా ప్రసంగం మొదలుపెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నా… “వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీని అభిమానించే వారు, శ్రద్ధగా ఆలకించండి” అంటూ తన విమర్శల దాడిని జనసేన అధినేత ప్రారంభించారు. ‘బంతి – చామంతి – పూబంతి – అవంతి’ అండ్ ‘వెల్లంపల్లి – వెల్లుల్లిపాయ’ అంటూ ప్రాసలతో అందుకున్న పవన్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
శుభసూచకంగా ఎవరైనా శంకుస్థాపనలతో పాలనను మొదలు పెడతారు, కానీ వైసీపీ కూల్చివేతతో పాలనను ప్రారంభించింది అంటూ మూడేళ్ళ నాటి ప్రజావేదిక కూల్చివేతను పరోక్షంగా ప్రస్తావించారు. అధికారం చేపట్టిన 3 నెలలకే ఇసుక సమస్యను తీసుకువచ్చిన వైసీపీకి ఇంత విధ్వంసకరమైన ఆలోచనలు ఎలా వస్తాయో అంటూ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు పవన్.
అసలు వైసీపీ వాళ్ళు రాజకీయాలలోకి ఏమనుకొని వచ్చారో గానీ… అంత బలమైన ప్రతిజ్ఞ చేయకపోతే ఇంత దరిద్రం చేయరు కదా అంటూ “వైసీపీ ప్రతిజ్ఞ”గా కీలక అంశాలను చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి
ఆంధ్రులందరూ మా బానిసలు
రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతాం
న్యాయ వ్యవస్థలను లెక్కే చేయం
పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం
ఉద్యోగులను ముప్పతిప్పలు పెడతాం, మూడు చెరువులు నీళ్లు తాగిస్తాం
నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తాం
రాష్ట్ర రహదారులను గుంతలు గుంతలు గుంతల మయం చేస్తాం
ప్రజల వెన్నుపూసలను విరగ్గొడతామ్, అలా విరగ్గొట్టేటంతవరకు విశ్రమించం
సహజంగా వచ్చే పెట్టుబడులతో మా 50 శాతం పెట్టుబడులను మేము లాక్కుంటాం
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి ఆర్ధిక మూలాలను దెబ్బకొడతాం
అన్నం పెట్టే రైతన్నలకు అండగా ఉంటామని చెప్తాం, అధికారంలోకి రాగానే అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం, ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం
ఇసుకను మాత్రం అప్పడంలా కరకరలాగా నమిలేస్తాం
సహజ వనరులను సొంతానికి వాడేసుకుంటాం
దేవతల విగ్రహాలను అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టుకుని రక్షించుకుంటాం
గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం
పార్కులు, స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టేస్తాం
సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజలను చిత్తుగా తాగిస్తాం
మా వైసీపీ పార్టీ ఆదాయ వనరులను మేము పెంచుకుంటాం
ఎవడన్నా గొంత్తెత్తితే చావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితక్కొట్టిస్తాం, మా వైసీపీ ఎంపీ అయినా సరే!
ఒక చాన్సు… ఒక్క ఛాన్సు… ఒక్క ఛాన్సిస్తే ఆంధ్రాను పాతికేళ్ళు వెనక్కి తీసుకుపోతాం
ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లల చేతిలో చాక్లేట్లు లాక్కుంటాం
ఇలా వైసీపీ ప్రతిజ్ఞగా చీల్చిచెండాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత మూడేళ్ళుగా వైసీపీ అందిస్తోన్న పాలనను వ్యంగ్యంగా అభివర్ణించిన పవన్ స్పీచ్ కు జనసైనికుల నుండి మంచి స్పందన లభించింది. అలాగే వైసీపీ నేతలకు మంట పుట్టించడంలో జనసేన అధినేత విజయవంతం అయ్యారు.



