వై నాట్ 175 అంటూ 2024 ఎన్నికలలో వైసీపీ ఎత్తుకున్న నినాదం చివరికి వై నాట్ 11 అంటూ ముగిసింది. అయితే తాజాగా వైస్ జగన్ 53 వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు నిర్వహించిన వేడుకలలో మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి 2029 ఎన్నికలకు గాను వైసీపీ క్యాడర్ కి ఒక కొత్త నినాదాన్ని అందించారు.
ఏపీలో జరగనున్న డీలిమిటేషన్ ద్వారా మొత్తం జిల్లాల సంఖ్య 225 కి పెరుగుతాయని, తద్వారా వైసీపీ 200 కి పైగా సీట్లు సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ, ఆ బాధ్యతను ఏపీ ప్రజలే నెరవేరుస్తారంటూ “వై నాట్ 200” నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే వైసీపీ అందుకున్న ఈ నినాదాన్ని పార్టీ క్యాడర్ నెరవేర్చడానికి సిద్ధంగా ఉందా.?
ఇప్పటికే రప్ప రప్ప అంటూ ఒక పక్క పుష్ప సినిమా డైలాగ్స్ తో రెచ్చిపోతున్న వైసీపీ క్యాడర్ కి ఇప్పుడు సజ్జల గారి వై నాట్ 200 నినాదం మరింత జోష్ ని అందించిందా.? లేక గత వై నాట్ 175 పీడ కలను గుర్తు చేసిందా.? అన్నది ఆ వైసీపీ శ్రేణులకే ఎరుక.
జగన్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం, వైసీపీ తిరిగి ప్రభుత్వం అనే అందలం దక్కడం ఖాయం అంటూ ఒకపక్క వైసీపీ పార్టీ క్యాడర్ ని లీడర్లను తట్టిలేపుతుంటే మరోపక్క ఏపీలో 15 ఏళ్ళ పాటు కూటమి పార్టీలదే అధికారం, బాబుదే ముఖ్యమంత్రి పీఠం అంటూ పవన్ నుంచి లోకేష్ వరకు నొక్కివక్కాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ నినాదం ప్రజలలోకి బలంగా వెళుతుందా.? లేక కూటమి నేతల ప్రకటనలు ప్రజలలో స్థిరమైన నమ్మకాన్ని కలిగిస్తాయా అనేది కాలమే బదులు చెప్పాలి.
అయితే వైసీపీ ఒకసారి వై నాట్ 175 అంటూ ఘోర అవమానాన్ని, భారీ ఓటమిని ఎదుర్కోవడంతో ఈ సారి ప్రత్యర్థి పార్టీలకు వైసీపీ కనీసం 25 సీట్లయినా కేటాయించిందా.? అంటూ వైసీపీ పై కౌంటర్లు పేలుతున్నాయి.






