ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల తీరుని సమూలంగా మార్చేశారని చెప్పక తప్పదు.
ఇదివరకు ఎన్నడూ లేని ఫ్యాక్షన్ దాడులు, పోలీస్ కేసులతో వేధింపులు, సోషల్ మీడియాలో అబద్ధాలు, వ్యక్తిత్వ హననం ఒకటేమిటి… రాజకీయాలలో ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. అయితే అవేవీ ఆయనను గెలిపించకపోగా ఓడిపోగానే, పార్టీలో అందరికీ కొత్త కష్టాలు తెచ్చి పెడుతున్నాయి.
అయితే వీటితో పాటు జగన్ ‘మూస రాజకీయాలను’ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత డబ్బా, పర నింద, సమయం, సందర్భం లేకుండా మంది మార్బలంతో బలప్రదర్శనలు చేయడం, పరామర్శ రాజకీయాలు వంటివి కూడా సమాంతరంగా చేస్తూనే ఉన్నారు.
కానీ ఈ మూస రాజకీయాలు కూడా బెడిసి కొడుతూనే ఉన్నాయి. అందుకు కారణం జగన్కి వాక్ శుద్ధి లేకపోవడమే. అది లేనందునే అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో ముఖాముఖీ మాట్లాడేందుకు భయపడి సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారి చేత మాట్లాడించేవారు. కానీ ఇప్పుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసి రావడంతో జగన్ తడబడుతున్నారు.
ఉదాహరణకు నేడు గుంటూరులో టిడిపి కార్యాలయంపై దాడి గురించి మాట్లాడుతూ తన పార్టీ నేతలను వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి తనని ఓ బూతు మాటతో తిట్టారంటూ ఆ పదాన్ని జగన్ ఒత్తి పలికారు. తద్వారా వైసీపి నేతలు టిడిపి కార్యాలయంపై దాడి చేయడాని జగన్ సమర్ధించుకోవాలనుకున్నారు. ఆ మాటతో ప్రజల సానుభూతి కూడా పొందవచ్చనుకున్నారు.
కానీ అందుకు భిన్నంగా ప్రజలు, నెటిజన్స్ స్పందిస్తున్నారు. టిడిపి కార్యాలయంపై వైసీపి మూకలు దాడి చేసిన్నట్లు జగన్ స్వయంగా ఒప్పుకొని ధృవీకరించిన్నట్లయింది కదా?రేపు కోర్టులో సాక్ష్యానికి జగన్ కూడా వెళ్ళాల్సి ఉంటుందేమో?అని కొందరు అభిప్రాయ పడుతుంటే, కొందరు నెటిజన్స్ జగన్ స్వయంగా ‘నన్ను అలా తిట్టారని చెప్పుకోవడం’ చూసి జోకులు వేస్తున్నారు.
ఇదివరకు టిడిపి యువనేత నారా లోకేష్ ఇదేవిదంగా తెలుగులో మాట్లాడేందుకు తడబడుతుంటే వైసీపి నేతలు, వారి సోషల్ మీడియా ఆయనతో ఓ ఆట ఆడుకున్నాయి. కానీ వాటితో నారా లోకేష్ క్రుంగిపోలేదు. వారి విమర్శలు, అవహేళనలను సవాలుగా స్వీకరించి, పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు. ప్రజలు, మీడియా ముందు ఏవిదంగా మాట్లాడాలో నేర్చుకున్నారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడిన తీరు, ఆయన హావభావాలను గమనించినవారు ఇతను అతనేనా? అని సందేహపడేవారంటే అతిశయోక్తి కాదు.
కనుక జగన్ ఏ రకం రాజకీయాలు చేయాలనుకున్నా ఈ ఖాళీ సమయంలో తెలుగులో తడబడకుండా మాట్లాడటం నేర్చుకుంటే ఆయనకి, వైసీపికి కూడా మంచిది.




