కోనసీమ, మాచర్ల, గుడివాడ… రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు వ్యాపిస్తున్నాయా?

YSRCP-Attack-on-TDP-Activistsఒకప్పుడు రాయలసీమ జిల్లాలలో ఫ్యాక్షనిస్ట్ దాడులు, హత్యలు జరుగుతుండేవి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఆ తరహా రాజకీయ విషసంస్కృతి చాప కింద నీరులా అన్ని జిల్లాలలో వ్యాపిస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రశాంతమైన కోనసీమలో విధ్వంసం జరుగగా, ఇటీవల పల్నాడు జిల్లా మాచర్లలో టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం కృష్ణ జిల్లాలోని గుడివాడలో టిడిపి ఇన్‌ఛార్జ్‌ రావి వేంకటేశ్వర రావు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు దాడి చేశారు.

వారు ఎంతకి తెగించారంటే రావి వేంకటేశ్వర రావు ఇంటి వద్ద ఉన్న టిడిపి కార్యకర్తలపైకి పెట్రోల్ నింపిన ప్యాకెట్స్ విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు నిప్పు అంటుకోలేదు. అంటుకొని ఉండి ఉంటే అక్కడ ఉన్నవారిలో చాలా మంది సజీవ దహనమై ఉండేవారని రావి వేంకటేశ్వర రావు అన్నారు.

ADVERTISEMENT

ఇంతకీ ఏం జరిగిందంటే, రావి వేంకటేశ్వర రావు అధ్వర్యంలో గుడివాడలో ఆదివారం సాయంత్రం వంగవీటి రంగా వర్దంతి నిర్వహించేందుకు టిడిపి కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకొన్నారు. కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళి రావి వేంకటేశ్వర రావుకి ఫోన్‌ చేసి ఆ కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని, నిర్వహించే ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించాడని రావి వేంకటేశ్వర రావు తెలిపారు.

కానీ తాము బెదిరింపులకు భయపడేది లేదని ఎట్టి పరిస్థితులలో వంగవీటి రంగా వర్దంతి నిర్వహిస్తామని చెప్పడంతో కాళీ తన అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి తన ఇంటి వద్ద ఉన్న టిడిపి కార్యకర్తలపై కర్రలతో దాడి చేశారని రావి వేంకటేశ్వర రావు ఆరోపించారు. వారిలో కొందరు పెట్రోల్ ప్యాకెట్స్ తమపైకి విసిరి నిప్పు అంటించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు తమపై కర్రలతో దాడులు చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.

గత మూడున్నరేళ్ళుగా గుడివాడలో కొడాలి నాని ఎంతగా రెచ్చిపోతున్నప్పటికీ తాము చాలా సంయమనం పాటిస్తున్నామని, కానీ ఇప్పుడు నేరుగా భౌతిక దాడులకి దిగుతున్నాడని రావి వేంకటేశ్వర రావు ఆరోపించారు. గుడివాడలో కొడాలి నాని, అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాళీ అతని అనుచరులు టిడిపి కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకోకుండా వారితో కలిసి మా కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం చాలా దారుణమని రావి వేంకటేశ్వర రావు ఆరోపించారు.

“వంగవీటి రాధ వర్ధంతి నిర్వహిస్తే అదే నీకు చివరి రోజవుతుందని కాళీ నన్ను బెదిరించాడు. అయినా పోలీసులు కాళీని అరెస్ట్ చేయకుండా నాపై కేసు నమోదు చేస్తున్నారు. పోలీసులు కూడా కొడాలి నానికి భయపడి గుడివాడలో ఆయన అనుచరులు చేస్తున్న ఇటువంటి అరాచకాలను చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. మాపై దాడి, హత్యాప్రయత్నం చేసిన కాళిని, వైసీపీ గూండాలని అరెస్ట్ చేయాలని మేము పోలీసులను డిమాండ్ చేస్తున్నాము,” అని రావి వేంకటేశ్వర రావు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories