ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ద్రోహం చేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. దీనిపై ముందుగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, “దీంతో నా గుండెల మీద భారం దిగిపోయింది. ఇక ప్రశాంతంగా నా నియోజకవర్గంలో పనిచేసుకోగలుగుతాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నాకు చాలా అనుబందం ఉంది. కానీ చివరికి నాపై ఇటువంటి నిందవేసి బయటకు పంపించారు. నేను జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడవలేదు. ఆయనే నాకు పొడిచారు. నేను డబ్బు తీసుకొన్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎవరి దగ్గర ఒక్క నయాపైసా తీసుకోలేదు. నాకు ఆ అవసరం లేదు కూడా. కావాలంటే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలను. నాపై ఈ ఆరోపణలు చేస్తున్న సజ్జల, మంత్రులు ఎవరైనా ప్రమాణం చేయగలరా?
వైసీపీలో ఎమ్మెల్యేలందరి పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఎవరికీ పార్టీలో చింతాకు అంత విలువ, గౌరవం లేవు. సచివాలయానికి వెళితే అక్కడ పట్టించుకొనే నాధుడే ఉండడు. ముఖ్యమంత్రి చుట్టూ కొందరు పెద్దలున్నారు. అంతా వారి పెత్తనమే. పార్టీలో చాలా అసంతృప్తి ఉంది కానీ ఎవరూ బయటపడటం లేదు. ఇది పార్టీకి మంచిది కాదు. కానీ వారు అహంభావంతో ప్రవర్తిస్తున్నారు. ఇలా విర్రవీగినవారందరినీ ఆ ప్రకృతే శిక్షించింది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి చాలా నష్టం జరుగబోతోంది. ముఖ్యంగా నెల్లూరులో ఓటమి తప్పదు. నేను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు. ప్రజలు కోరుకొంటే రాజకీయాలలో ఉంటా వద్దనుకొంటే హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకొంటా. అంతా ఆ దేవుడే నిర్ణయిస్తాడు,” అని అన్నారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై ఇప్పుడు వేటు పడింది కనుక ఈవిదంగా మాట్లాడుతున్నారనుకోవడానికి లేదు. పార్టీ, ప్రభుత్వం తీరు పట్ల ఆయన చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ కుటుంబంతో ఇంత సుదీర్గ అనుబందం ఉన్నప్పటికీ ఆయనను ఇంత అవమానకరంగా బయటకు సాగనంపడం జీర్ణించుకోవడం కష్టమే. అయితే చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మలనే దూరం చేసుకొన్నవారికి మేకపాటి, కోటంరెడ్డి ఓ లెక్కా?అని వారి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఈ వాదోపవాదాలను పక్కనపెడితే, రాబోయే ఎన్నికలలో ‘తమ పద్దతి’లో గెలవగలమని వైసీపీ భ్రమపడుతోందని, కానీ ఇటువంటి ధోరణి కారణంగానే పార్టీ మునిగిపోవడం ఖాయమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికనైనా వైసీపీ పెద్దలు పట్టించుకొంటారో లేదో?



