అవును, ఇన్నాళ్ల తన నిశబ్దాన్ని వైసీపీ తిరుమల లడ్డు సాక్షిగా బద్దలు కొట్టింది, కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ లో నిద్రాణమైన రాజకీయాన్ని తట్టి లేపింది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి…ఈ అంశం తెరమీదకొచ్చినప్పుడు డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిన వైసీపీ ఇప్పుడు ఎఫన్స్ మోడ్ లోకి వెళ్ళింది వై.? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.
NDDB రిపోర్ట్ ఆధారంగా తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని నిర్దారణ జరిగింది. అయితే ఆ సమయంలో వైసీపీ పూర్తిగా ఈ అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. ఇటు కూటమి కూడా ఈ నివేదిక ఆధారంగా వైసీపీ పై భారీ స్థాయిలో ఎటాక్ కి దిగలేదు.
ఇక తాజాగా బయటకొచ్చిన సిట్ నివేదికలో అసలు అది నెయ్యి కాదని, పామ్ ఆయిల్, కొన్ని రకాల కెమికల్స్ తో తయారు చేసిన ఒక సింథటిక్ మిశ్రమమని తేలింది. అయితే ఇక్కడ జంతు కొవ్వు విషయంలో సిట్ ప్రత్యేకంగా ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.
ఇక ఇక్కడ మొదలైన వైసీపీ రాజకీయం అంబటి బూతు పురాణాల వరకు, జోగి మితిమీరిన వ్యాఖ్యల వరకు సాగింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో తనకు, తన పార్టీకి సిట్ క్లిన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ మొదలుపెట్టిన నీలి ప్రచారం నానాటికి బలపడుతుంది, కూటమి వాదనను బలహీనపరుస్తుంది.
అందుకు వారు ఎంచుకున్న విధానాలు, అమలు పరుస్తున్న వ్యూహాలు అన్ని కూడా వైసీపీ స్వరాన్ని పెంచుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం, తద్వారా టీడీపీ పార్టీ శ్రేణులను రెచ్చకొట్టడం, లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దానిఫలితంగా తెలుగుదేశం క్యాడర్ ని కవ్వించడం,
ఇక అక్కడినుంచి జగన్ వైసీపీ నేతల కోసం ఓదార్పు యాత్రల పేరుతో, పరామర్శల పర్యటనల సాకుతో రోడ్ల మీదకు రావడం, రప్ప రప్ప నినాదాలు చేస్తూ స్థానికంగా భయానక పరిస్థితులు సృష్టించడం…ఇక ఆ నెపంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది అంటూ నానా హంగామా చేయడం.
అలాగే తిరుమల పుణ్యక్షేత్రం వంటి పవిత్ర దేవాలయ ప్రసాదం మీద కల్తీ మరకలు వేసి ఆ మరకలకు తమకు ఎటువంటి సంబంధం లేదు అనేలా ప్రకటనలు చేయడం, దానికి బలం చేకూరేలా ఇన్నాళ్లు వైసీపీ కోసం తెరవెనుక సేవలు అందించే వారిని ఇప్పుడు తెరముందుకు తేవడం, అలాగే కల్తీ నెయ్యిలో కుల రాజకీయాలు జోడించి ఒక్క అంశాన్ని రెండు వివాదాలుగా మలచడం అన్ని చకచకా జరిగిపోయాయి, పోతున్నాయి కూడా.
కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ చేస్తున్న ప్రకటనలు వైసీపీ రచిస్తున్న పథక రచనలు వైసీపీ క్యాడర్లో జోష్ తెచ్చాయి, అలాగే అంబటి వ్యవహారంలో, జోగి విషయంలో జగన్ పరామర్శలు, పర్యటనలు వైసీపీ లీడర్లకు నోళ్లు తెచ్చాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం వంటి ఊహించని నిర్ణయాలతో రాబోయే మూడేళ్ళ తరువాత ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే తన రాజకియాన్ని మొదలుపెట్టిందా అంటూ ఇంట బయట సందేహాలు మొదలయ్యాయి.






