వైసీపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణగా రాష్ట్ర రాజధాని అమరావతి దుస్థితిని ఇప్పటికే ప్రజలు చూసారు. కేవలం ఒక పార్టీకి రాజధాని క్రెడిట్ వెళ్తుందని, ఒక నాయకుడి విజనరీ మరోసారి చరిత్రగా మారబోతుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో వైసీపీ అమరావతిని కాదని మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చింది.
అలాగే తన పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు రాజధాని నిర్మాణాల వ్యయం అడ్డంకి కానుంది అనేది కూడా అమరావతి సమాధికి మరో కారణం. నాడు ప్రజా వేదిక కూల్చివేత తో మొదలైన వైసీపీ విధ్వంశం పాలన అమరావతి సమాధి వరకు సాగింది.
అటువంటి వైసీపీ ఇప్పుడు ప్రజలు తమకు తమ పార్టీకి ఇచ్చిన తీర్పుని ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ 2.0 అధికారంలోకి వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పిపిపి విధానాన్ని రద్దు చేస్తామని, ఆ విధాన్ని అనుసరించి మెడికల్ కాలేజీలను ప్రవేటీకరణకు తీసుకునే వారిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలలోనే జైల్లో పెడతామంటూ బెదిరింపు హెచ్చరికలను పంపుతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.
ఇలా వైసీపీ అధికారంలో ఉంటే ఇక రాష్ట్రంలో నిర్మాణాలు జరగవని, వైసీపీ ప్రభుత్వం జరగనివ్వదని పార్టీ అధినేతే స్వయంగా ప్రకటిస్తుంటే ఇక వైసీపీ ని నమ్మి ఓటేసేందుకు ఏపీ ఓటర్లు ముందుకొస్తారా.? నాడు అమరావతి నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్ల మీదకు తెచ్చిన జగన్,
రేపు పిపిపి విధానాలతో ప్రభుత్వాన్ని నమ్మి మెడికల్ కాలేజ్ ల నిర్మాణాలను చేపడుతున్న వారిని అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తుంటే ఈ నిర్మాణాలను చేపట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారా.? ఇలా ప్రతి విషయంలోనూ కూటమి ఎడ్డెం అంటే వైసీపీ తెడ్డం అంటూ ముందుకెళ్తుంటే రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి జరుగుతుందా.?
నాడు అమరావతి నిర్మాణాలను ఆపడానికి కోర్టులకెళ్లి, ప్రపంచ బ్యాంకులకు మైళ్ళు పెట్టిన వైసీపీ నేడు మెడికల్ కాలేజ్ ల నిర్మాణాలను అడ్డుకోవడానికి సైతం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు, కోటి సంతకాల సేకరణ అంటూ హంగామా చేస్తున్నారు.
నాడు అమరావతి విషయంలో వైసీపీ అనుసరించిన విధానాలకు 2024 ఎన్నికలలో ప్రజలు వైసీపీ కి ఘోర ఓటమితో గుణపాఠం చెప్పినా వైసీపీ ఇంకా పిపిపి కి వ్యతిరేకంగా కోర్టులో అఫిడవిట్ వేసి సీఎం బాబుకి గుణపాఠం చెపుతాం అంటూ ప్రకటనలు చేయడం నిజంగా హాస్యాస్పదమనే చెప్పాలి.






