తెలంగాణ రాజకీయాలలో నిన్నటివరకు టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న యుద్ధాలకి సంబందించిన వార్తాలే ఎక్కువగా వినిపిస్తుండేవి. కానీ వాటిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడితో డామినేట్ చేస్తున్నారు. ఎటువంటి గుర్తింపు లేకుండా సాగిపోతున్న ఆమె ప్రజాసంగ్రామ పాదయాత్రపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం ద్వారా ఆమెకి టిఆర్ఎస్ చక్కటి గుర్తింపు ఇచ్చింది. దానిని పట్టుకొని ఆమె చక్కగా అల్లుకుపోతున్నారిప్పుడు.
హైకోర్టు అనుమతించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తన పాదయాత్రని అనుమతించడం లేదంటూ ఆమె నిన్న ట్యాంక్బండ్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోగా పోలీసులు ఆమెను బలవంతంగా వ్యాన్లో ఎక్కించి లోటస్ పాండ్ నివాసం వద్ద దించేశారు. అయితే ఆమె అక్కడే తన ఇంటి ముందు కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో, అక్కడకి వైఎస్సార్ టిపి కార్యకర్తలు చేరుకొంటున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కి తిప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
నేడో రేపో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి హాస్పిటల్కి తరలించడం ఖాయం. అక్కడ కూడా ఆమె దీక్ష కొనసాగించే ప్రయత్నం చేయడం ఖాయం. కనుక మరికొన్ని రోజులు హైదరాబాద్లో షర్మిల హడావుడి కొనసాగుతోందన్న మాట!
ఇంతకాలం ఆమె పాదయాత్రలో సిఎం కేసీఆర్ని, ఆయన ప్రభుత్వాన్ని ఆమె ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఆమె పాదయాత్రకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు అనుమతించినా ఆమె పాదయాత్రని అడ్డుకొంటుండటంకాస్త ఆలోచింపజేస్తోంది.
నిజానికి ఆమెని పాదయాత్ర చేసుకోనిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వానికి కొత్తగా వచ్చే అప్రదిష్ట, కష్టం, నష్టం ఏమీ లేవనే చెప్పాలి. ఆమె కూడా మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించకుండా హైదరాబాద్లో ఆమరణ దీక్ష చేస్తుండటం గమనిస్తే, టిఆర్ఎస్, వైఎస్సార్ టిపిలు రెండూ చక్కటి అవగాహనతోనే ఈ డ్రామా కొనసాగిస్తున్నట్లు అర్దం అవుతోంది. రాష్ట్రంలో బిజెపి, బండి సంజయ్ హడావుడిని తగ్గించి చూపేందుకే రెండు పార్టీలు కలిసి ఈ డ్రామా ఆడుతున్నాయేమో?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



