జగనన్నకు అనుభవం రాలేదు మరో 5 ఏళ్ళు ఇస్తే నేర్చుకొంటాడు!

Adoni-MLA-Sai-Prasad-Reddy-Jaganసిఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిని, పాలనా విధానాలను, నిర్ణయాలను ప్రతిపక్షాలు నిత్యం వేలెత్తి చూపిస్తూనే ఉంటాయి. కనుక వాటిని రాజకీయ విమర్శలుగా కొట్టిపడేసినా వైసీపీలో నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఇంకా పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట అంటున్నారంటే ప్రతిపక్షాల విమర్శలు నిజమే అనుకోవలసి ఉంటుంది. వైఎస్ కుటుంబంతో దశాబ్ధాలుగా అనుబంధం ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సిఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిపై చేస్తున్న విమర్శలు అందరూ విన్నారు.

తాజాగా కర్నూలు జిల్లాలోని ఆదోని వైసీపీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి శుక్రవారం తన నియోజకవర్గంలో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి తమ జగనన్న ఫోటో ఉన్న స్టికర్స్ అంటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

“వైసీపీలో అసంతృప్తి ఉన్నమాట నిజమే. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనన్నకు పాలనలో ఇంకా పూర్తిగా అనుభవం రాలేదు. ఐదేళ్ళు పూర్తయితే పార్టీ క్యాడర్‌తో ఏ విదంగా వ్యవహరించాలి? వారికి ఏవిదంగా తోడ్పడాలి?రాష్ట్రాన్ని ఏవిదంగా ముందుకు తీసుకుపోవాలి?అనే విషయాలు నీర్చుకొంటారేమో? కనుక ప్రజలు మరో ఐదేళ్ళు అవకాశం ఇస్తే జగనన్న అన్నీ నేర్చుకుంటారు,” అని అన్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి తీరు సరిగ్గా లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి కాస్త సున్నితంగానే చెప్పినప్పటికీ, తమ అధినేత తీరుతో అసంతృప్తిగా ఉన్నాననే విషయం స్పష్టంగానే చెప్పిన్నట్లు భావించవచ్చు.

నిజానికి మూడు రాజధానులు, సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, గడప గడపకి కార్యక్రమాల గురించి ప్రజలేమనుకొంటున్నారో పక్కన పెట్టినా, కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమనుకొంటున్నారో సిఎం జగన్‌ తెలుసుకొంటున్నారో లేదో?పైగా వైసీపీ అంటే జగన్‌ మాత్రమే…. జగన్‌ అంటేనే వైసీపీ అన్నట్లు పార్టీని మార్చేసి, జనం తన మొహం చూసే ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తారన్నట్లు వ్యవహరిస్తుండటంతో మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వీయ రాజకీయ గుర్తింపు లేకుండాపోతోంది. ఈ కారణంగా ప్రజల దృష్టిలో వారు అనామకులుగా మిగిలిపోతుంటే వారి రాజకీయ జీవితం జీరో అయిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ఉదాహరణకు ప్రభుత్వంలో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడదల రజని మొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో అందరి ముందు కన్నీళ్ళు పెట్టుకొంటూ తమ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఏవిదంగా తిప్పలు పడ్డారో అందరూ చూశారు. ఓ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి దుస్థితిలో ఉంటే ఇక ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మారుమూల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పరిస్థితి ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి ఇదేవిషయం కాస్త సున్నితంగా చెప్పారనుకోవచ్చు. కానీ మీడియా ఎదుట ముఖ్యమంత్రినే వేలెత్తి చూపుతూ మాట్లాడారు కనుక ముందుగా ఒక రౌండ్ బుజ్జగింపులు… అవి పనిచేయకపోతే ఆయన నియోజకవర్గానికి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించడం ఖాయమనే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories