ఓ సమస్య, సంఘటన, అంశంపై ప్రజలు కొంత కాలమే ఆసక్తి చూపుతుంటారు. ఈ విషయం మన రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందుకే ఎలాంటి వివాదంలో చిక్కుకున్నా నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే చాలనుకుంటారు.
మీడియాకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు ఏదో ఓ ‘హాట్, స్పైసీ టాపిక్’ వెతికి పట్టుకొని దాంతో ఓ నాలుగైదు రోజులు కాలక్షేపం చేసేసి తర్వాత మరోటి వెతికి పట్టుకుంటుంది.
కానీ చేతికి నెయ్యి అంటుకుంటే ఆ జిడ్డు అంత తొందరగా వదలదనో లేదా అసలు నెయ్యి కంటే కల్తీ నెయ్యే రాజకీయంగా గుమగుమలాడుతోందని అనుకున్నారో తెలీదు కానీ మీడియాతో సహా అధికార, ప్రతిపక్షాలు ఆ కల్తీ నెయ్యిలో మునిగి తేలుతున్నాయి.
వివేకానంద రెడ్డి దారుణ హత్య, ఆ కేసుకు సంబందించిన వార్తలు వినడానికే ప్రజలు ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే సంచలనం సృష్టించిన మద్యం, కల్తీ మద్యం కేసులు, అరెస్టులు, బెయిలు వార్తలు చూసి చూసి ప్రజలకు బోర్ కొట్టేస్తోంది.
కేటీఆర్ చెప్పినట్లుగా ఈ కేసులు, విచారణలు అంతే లేని తెలుగు డైలీ సీరియల్లా సాగిపోతున్నాయి. ఏ ఒక్క కేసులో ఏ ఒక్కరిని దోషిగా నిరూపించి శిక్ష పడేలా చేయలేనప్పుడు అది డైలీ సీరియల్గానే మారుతుంది. కనీసం అవి కాలక్షేపానికి కూడా పనికిరావు. అందుకే ప్రజలు పట్టించుకోవడం లేదు.
ఈ విషయం కూటమి ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు తెలియదనుకోలేము. అందరూ కలిసి ప్రజల ఆసక్తిని ఇలా చంపేయగలిగితే ఇక ఆ కేసుల గురించి ఎవరూ పట్టించుకోరు.. కనుక అందరూ కులాసాగా బయట పడవచ్చని భావిస్తున్నారేమో?
ఈ డైలీ సీరియల్ ఇలాగే సాగాలని వైసీపీ నేతలు కోరుకోవడం సహజమే. కానీ కూటమి ప్రభుత్వం కూడా డైలీ సీరియల్ కొనసాగించాలని ఎందుకు భావిస్తోంది? అనేదే ప్రశ్న.
ఇవన్నీ డైలీ సీరియల్సే కదాని తేలికగా తీసుకుంటే చేతికి మరక అంటుకుంటుంది. అప్పుడు దానిని కడుక్కోవడానికి ఏ ‘సంస్కారవంతమైన సబ్బు’ ఉపయోగపడకపోవచ్చు. కల్తీ నెయ్యిలో ‘హెరిటేజ్’ ప్రస్తావన ఓ చిన్న శాంపిల్… కాదా?






