జగన్ పాలనలో రాజధాని అమరావతిని 5 ఏళ్ళపాటు పాడుబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పేరుకుపోయినా చెత్తా చెదారాన్ని, పునాదులలో నిలిచిన నీటిని తొలగించారు. జంగిల్ క్లియరెన్స్ పనులకే దాదాపు 5-6 నెలల సమయం, లక్షల రూపాయలు ఖర్చయ్యాయి.
కానీ పనులు మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. ఏకకాలం హైకోర్టు నూతన భవన నిర్మాణం, ఇకానిక్ టవర్స్, మంత్రులు, అధికారుల నివాసాలు, క్వాంటం వ్యాలీ భవన సముదాయాల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వీటితో పాటు సీడ్ యాక్సిస్ రోడ్, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తున్నారు.
అమరావతిలో ఎక్కడ చూసినా భారీ వాహనాలు, యంత్రాలు తిరుగుతున్నాయి. ఒకేసారి అనేక భవనాలు నిర్మిస్తుండటంతో వేలాది మంది కార్మికులతో రాజధాని ప్రాంతం అంతా కళకళలాడుతోంది.
అమరావతిలో పరిమి తుళ్ళూరు మద్య 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంశ్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు భారీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇటీవలే విగ్రహం అక్కడకు చేరుకుంది. మార్చి 16న ఆయన జయంతి రోజున విగ్రహావిష్కరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని చకచకా పనులు చేస్తున్నారు.
పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి బలిదానం చేసుకున్నారు. కనుక ఆయన త్యాగానికి సంకేతంగా 58 అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.
మరోపక్క అమరావతి ప్రస్తుతం హైకోర్టు ఉన్న నేలపాడులోనే రూ.1,048 కోట్లు ఖర్చుతో 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+7 అంతస్తులుగా హైకోర్టు శాశ్విత భవన నిర్మాణం సాగుతోంది. దీనిలో మొత్తం 52 కోర్టు హాల్స్ ఉంటాయి. ఏడవ అంతస్తులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం ఉంటుంది.
అమరావతిలో నిర్మాణ పనులన్నిటినీ పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికలలోగా అన్నిటినీ పూర్తి చేస్తామని చెపుతున్నారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ బిల్లు ఆమోదింపజేసే అవకాశం ఉంది. కనుక ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతిని రాజధానిగానే ఉంటుంది.






