వైసీపీ నేతలందరూ ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకి వ్యతిరేకంగా ఓ లైన్ అనుకొని తర్వాత అందరూ ఒకేసారి దాని ప్రకారం కోరస్ పాడుతుంటారు. ఇది రాజకీయాలలో సహజమే. అయితే వాటితో ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయగలిగేరనేది ఇంకా ముఖ్యం.
ఉదాహరణకి సిఎం జగన్తో సహా వైసీపీలో అందరూ దుష్టచతుష్టయం అంటూ కోరస్ పాడారు. ఆ తర్వాత దత్తపుత్రుడు, ఆ తర్వాత చెడిపోయిన వ్యవస్థతో పోరాడుతున్నాము… అంటూ రకరకాల వాదనలు బలంగా వినిపించారు. వాటి తర్వాత తాజాగా చంద్రబాబు నాయుడు ఎక్కడ కాలుపెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతారంటూ వైసీపీ నేతలు కోరస్ పాడుతున్నారు. ఒక అబద్దాన్ని పదేపదే గట్టిగా చెపుతుంటే చివరికి అదే నిజమైపోతుందన్నట్లు ఇదీ అలాగే జరగవచ్చని వైసీపీ నేతలు ఆశిస్తున్నారేమో?
ఏనాడూ తన శాఖకి సంబందించి విషయాలని మీడియాతో మాట్లాడని మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రస్తుతం వైసీపీ అందుకొన్న ఈ కొత్త లైన్ ప్రకారం చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన చోటల్లా జనాలు పిట్టలా రాలిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది కనుక ప్రజాశ్రేయస్సు కోసమే ఈ జీవోని తీసుకువచ్చామని అన్నారు. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఆ జీవోని వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడుకి కుప్పంలో ఓటమి తప్పదని గ్రహించి పదేపదే కుప్పం వెళ్ళివస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇప్పటికే మంత్రి రోజా కూడా ఇదే యాంగిల్లో చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. కనుక మిగిలినవారు కూడా నేడో రేపో మీడియా ముందుకు వచ్చి ఇదే లైన్లో కోరస్ పాడటం ఖాయమే.
చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభలలో మరొక్కసారి అటువంటి విషాదఘటన జరిగితే ఇక వారి వాదనలు ప్రజలకి బలంగా చేరుతాయి. అది టిడిపిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కనుక టిడిపి జాగ్రత్తపడక తప్పదు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలు, ర్యాలీలకు చాలా భారీగా అభిమానులు తరలివస్తుంటారు కనుక జనసేన కూడా జాగ్రత్తపడటం చాలా అవసరం.



