ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలు, డిమాండ్స్ పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వంతో యుద్ధానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ తోటి నేతలతో కలిసి మంగళవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రభుత్వానికి మెత్తగా, మర్యాదగా చెప్తే వినేరకం కాదు. కనుక కాస్త గట్టిగా వినిపించేలా చెప్పాల్సిందే. మా జీతాలు, బకాయిల సమస్యల గురించి ఏడాదిన్నరగా ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చించినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలే రూ.12,000 కోట్లున్నాయి. ఆ లెక్కన ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి సగటున రూ.2.25 నుంచి 3.50 లక్షల చొప్పున బాకీ ఉంది. కానీ వాటిని ఇంకా ఎప్పుడు చెల్లిస్తుందో… అసలు చెల్లించే ఉద్దేశ్యం ఉందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే నెలనెలా మాకు జీతాలు ఇవ్వడమే చాలా గొప్ప విషయమన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ప్రభుత్వం మా బకాయిలు చెల్లించకుండా, బుక్ అడ్జస్ట్మెంట్లో మాత్రం సొమ్ము చెల్లించిన్నట్లు చూపుతోంది. దీంతో మా జీపీఎఫ్ ఖాతాలలో చెల్లింపులు జరగడం లేదు. ఇంకా పీఆర్సీ కధ వేరే ఉంది. అందుకే మేము గవర్నర్ని కలిసి మా సమస్యలన్నీ చెప్పుకోవలసి వచ్చింది. అప్పటికైనా ప్రభుత్వం మా బకాయిల చెల్లింపులు చేస్తుందనుకొంటే మా సంఘాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించడం చాలా శోచనీయం.
ప్రభుత్వం తీరుతో ఉద్యోగులందరూ విసుగెత్తిపోయున్నారు. కనుక మా బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచక తప్పదు. అయితే మెత్తగా నిరసనలు తెలిపితే పట్టించుకొని స్పందించే ప్రభుత్వం కాదిది. కనుక కాస్త తీవ్రంగానే నిరసనలు తెలపాల్సి ఉంటుంది. ఉద్యోగుల బకాయిల కోసం ఎవరు పోరాడినా మా సంఘం తరపున వారికి పూర్తి సహకారం, మద్దతు ఇస్తాం. మేము కూడా ఏప్రిల్ నుంచి ఉద్యమానికి సిద్దం అవుతున్నాము. ఈలోగా ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె చేసేందుకు వెనుకాడబోము,” అని హెచ్చరించారు.
మరోపక్క ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన మొన్న ఆదివారం విజయవాడలో సమావేశమైనప్పుడు “మంత్రుల సబ్ కమిటీ చర్చల పేరుతో ఉద్యోగ సంఘాలతో నిర్వహిస్తున్న భేటీలు కేవలం ‘ఛాయ్ బిస్కట్ సమావేశాలు’ గానే మిగిలిపోతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా కార్యాచరణ కూడా ప్రకటించారు.
ఆదేరోజు గుంటూరులో ఎస్టీయు అధ్వర్యంలో జరిగిన మరో సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన ఉపాధ్యాయుల జీతాలు, బకాయిల చెల్లింపులపై ప్రభుత్వాన్ని నిలదీసి ఆందోళనలు మొదలుపెడతామని హెచ్చరించారు.
కానీ వైసీపీ ప్రభుత్వం తీరు మాత్రం నిమ్మకి నీరెత్తిన్నట్లు ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ఎంతసేపు టిడిపి, జనసేనల పొత్తుల గురించి లేదా మూడు రాజధానులు, విశాఖ రాజధాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల సహనం నశిస్తోందని వారి హెచ్చరికలే చెపుతున్నాయి.



