నల్ల బ్యాడ్జీలే వైసీపీ కొంప ముంచాయా?

AP_Amaravati_JAC_Chairman_ Bopparaju_Venkateswarluకర్ణుడు చావుకి ఎన్నో కారణాలన్నట్లు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి చేతిలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి రావడం తన విజయావకాశాలను దెబ్బ తీసిందని ఆరోపించారు.

ADVERTISEMENT

ఆయన ఆరోపణపై ఏపీ జేఏసీ సంఘం అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ, “మేము మా సమస్యలు, డిమాండ్స్ పరిష్కారం కోసం మార్చి 9 నుంచి ఏప్రిల్ 5వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని ముందే జిల్లా కలెక్టర్‌కు తెలియజేశాము. కనుకనే ఎన్నికల ప్రక్రియకు కూడా నల్ల బ్యాడ్జీలతోనే హాజరయ్యాము తప్ప మాకు వేరే ఉద్దేశ్యం లేదు. కానీ మేము నల్ల బ్యాడ్జీలు ధరించి ఓటర్లను ప్రభావితం చేశామని వెన్నపూస రవీంద్రారెడ్డి చాలా దారుణమైన ఆరోపణ చేశారు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఒకవేళ మేము నల్ల బ్యాడ్జీలు ధరించడం వలననే ఓటర్లు ప్రభావితం అయ్యారనుకొంటే న్యాయపరంగా మీరు ముందుకు వెళ్లవచ్చు.

మాకెవరికీ ప్రభుత్వంతో ఎటువంటి శతృత్వం, వ్యతిరేకత లేదు. మేము ఏనాడూ ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వ విధానాలను మేము విమర్శించలేదు. మా జీతాలు ఇతర సమస్యల గురించి, మేము జీపీఎఫ్ ఖాతాలలో దాచుకొన్న సొమ్ముని ప్రభుత్వం తీసి వాడేసుకోవడం గురించి, మా పెండింగ్ బకాయిల గురించి మాత్రమే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము తప్ప మాకు ఎటువంటి రాజకీయ దురుదేశ్యాలు లేవు.

ఈ నెలాఖరులోగా మా పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పింది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు నెరవేర్చలేదనే విషయం కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మళ్ళీ గుర్తుచేస్తున్నాము. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావలసిన బకాయిలు, మాకు ఇచ్చిన హామీలను అమలుచేయమని మాత్రమే కోరుతున్నాము. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు.

కనుక మార్చి 21 నుంచి వర్క్ టూ రూల్ పాటించబోతున్నాము. ఇప్పటి వరకు ఎంత ఆలస్యమైనా పని పూర్తిచేసి ఇళ్లకు వెళ్ళేవాళ్ళము. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకే పనిచేస్తాము. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం ఉదృతం చేయడానికి వెనకాడబోము,” అని హెచ్చరించారు.

ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరిస్తేనే వైసీపీకి ఎంత నష్టం జరుగుతుందో అర్దం చేసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా భావించవచ్చు. అదే… శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని దాదాపు 13 లక్షలమంది ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే?

ADVERTISEMENT
Latest Stories