ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో అంకం ప్రారంభం కానుంది. ఇప్పటికే తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం… ఇప్పుడు శాశ్వత కట్టడాల నిర్మాణాలను ప్రారంభించనుంది. మొత్తం 950 ఎకరాల్లో రాజ్ భవన్, సీఎం కార్యాలయం, శాశ్వత సచివాలయం, మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇతర ప్రభుత్వ భవనాలను ఈ దఫా నిర్మించనున్నారు.
అమరావతి పరిధిలోని రాయపూడి, లింగాయపాలెం రెవెన్యూలో పూర్తిగా, ఉద్ధండ్రాయునిపాలెం, కొండమరాజుపాలెంలో కొంతవరకు భూముల్లో ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ నెల 28న ఈ కార్యక్రమానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు. శంకుస్థాపన కార్యక్రమం కోసం వంద ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్నారు. దీని కోసం 20కి పైగా యంత్రాలను తరలించి, త్వరితగతిన పనులు పూర్తి కావాలని సీఆర్డీఏ కమిషనర్ అధికారులను ఆదేశించారు.



