ఇదేమి ఖర్మ ఏపీ ప్రభుత్వోద్యోగులకి?

AP Union Leadersటిడిపి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి?’ పేరుతో రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు కూడా సకాలంలో జీతాలు అందక ‘ఇదేం ఖర్మ మాకు?’ అని తిట్టుకొంటున్నారు. ఈ నెలలో సంక్రాంతి పెద్ద పండుగ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఏదోవిదంగా జీతాలు చెల్లించింది. కానీ ఫిభ్రవరి నుంచి మళ్ళీ షరా మామూలే అని వారికీ తెలుసు.

అందుకే సహనం నశించిన ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘాల నేతలు ముందుగా హెచ్చరించిన్నట్లే కార్యాచరణ మొదలుపెట్టారు. ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ నేతృత్వంలో ఆరుగురు నాయకులు గురువారం ఉదయం రాజ్‌భవన్‌కి వెళ్ళి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వాభూషణ్ హరిచందన్‌ని కలిసి తమ గోడు మొరపెట్టుకొన్నారు. నెలనెలా జీతాల కోసం తాము రోడ్లెక్కి ధర్నాలు చేయవలసిరావడం చాలా అవమానంగా ఉందని వారు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. జీతాలే అందని పరిస్థితులలో తమ డీఏ బకాయిలు, ఇతర ఆర్ధిక ప్రయోజనాలని అడగలేని పరిస్థితి ప్రభుత్వం కల్పించిందని వారు ఆరోపించారు. ఇకనైనా ప్రతీనెల 1వ తేదీన తమకి జీతాలు ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ వారు గవర్నర్‌కి వినతిపత్రం ఇచ్చారు.

ADVERTISEMENT

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, “మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ప్రతీనెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, మా డీఏ తదితర బకాయిలని చెల్లించాలని మాత్రమే కోరుతున్నాము. మా అనుమతి లేకుండా 90 వేలమంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బు తీసి వాడేసుకొంది. ఆర్ధికశాఖ అధికారులని అడిగితే పొంతనలేని సమాధానాలు చెపుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయినప్పుడు అడిగితే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా అవమానకరంగా వ్యవహరిస్తోంది.

మా సమస్యలని ప్రభుత్వం పట్టించుకోనందునే మేము గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేయవలసి వచ్చింది. ఆయనకి అన్ని విషయాలు వివరించి న్యాయం చేయాలని కోరాము. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ప్రభుత్వ ధోరణి మారకపోతే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాము. అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకొంటున్నాము. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీనెల 1వ తేదీన మాజీతాలు చెల్లిస్తూ, మాకు రావలసిన ఆర్ధిక ప్రయోజనాలను తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాము,” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకొందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చెప్పారు. ఇది రాష్ట్రానికి, ప్రభుత్వానికి కూడా అవమానమే కదా?సంక్షేమ పధకాలకి టంచనుగా నిధులు విడుదల చేయడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది తప్ప తమకి నెలనెలా జీతాలు చెల్లించడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు లేదని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు.

ADVERTISEMENT
Latest Stories