అవును! టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయంగా బద్దశత్రువులే. విజయసాయి రెడ్డి నిత్యం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టిడిపిలని విమర్శిస్తూనే ఉంటారు. టిడిపి నేతలు కూడా ఆయనని విమర్శిస్తుంటారు. అయితే అటు విజయసాయి రెడ్డికి, ఇటు చంద్రబాబు నాయుడుకి ఆప్తుడైన తారకరత్న మరణించినప్పుడు ఆ విషాద సమయంలో ఒకరికొకరు ఎదురుపడితే మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం సహజం. వారేకాదు… అటువంటి సమయంలో ఎవరైనా అలాగే హుందాగా వ్యవహరిస్తారు తప్ప రాజకీయ శత్రుత్వాల గురించి ఆలోచించరు. ఒకవేళ వారు అక్కడా రాజకీయ ధోరణితో వ్యవహరిస్తే, అందరూ వారిని తప్పక విమర్శిస్తారు.
విజయసాయి రెడ్డి నిన్న తారకరత్నకి నివాళులు అర్పించిన తర్వాత అలేఖ్య రెడ్డిని, పిల్లలని ఓదార్చారు. అక్కడే ఉన్న బాలకృష్ణకి కూడా ధైర్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చొని మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అంతే!
దీనినే నిర్మాత బండ్ల గణేష్ తప్పు పడుతూ, “నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!” అంటూ ట్వీట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి పక్కపక్కన కూర్చొని మాట్లాడుకొంటున్న ఫోటోని పోస్ట్ చేశారు.
జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యించి అన్నారా లేదా విజయసాయి రెడ్డి అన్నారా?అనే ప్రశ్నకి ఆయనే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎంతకాలం రాజకీయాలలో ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసిన రాజకీయాలలో రాణించలేకపోయిన బండ్ల గణేష్, రాష్ట్ర రాజకీయాలని శాశిస్తున్న ఆ ఇద్దరి గురించి ఈవిదంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.



