టిడిపి యువనేత నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా చాగల్లులో ముస్లిం సోదరులతో సమావేశమైనప్పుడు, వారు బిజెపి పొత్తు పెట్టుకోవడం గురించి నారా లోకేష్ని ప్రశ్నించారు. ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. వారికి సంతృప్తి కలిగించేలా సమాధానం చెప్పడం ఇంకా కష్టం. కానీ నారా లోకేష్ ఏమాత్రం తడబడకుండా, “మీ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అవును 2014-2017 నుంచి మేము బిజెపితో పొత్తులో ఉన్నమాట వాస్తవం. అయితే బిజెపితో పొత్తులో ఉన్నందున ఏనాడైనా మీపై దాడి జరిగిందా? ఏనాడైనా మిమ్మల్ని అవమానించామా? బిజెపితో పొత్తు ఉన్నా రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరు? టిడిపి ప్రభుత్వమే కదా? బిజెపితో పొత్తు ఉన్నా ముస్లింల సంక్షేమ పధకాలకు నిధులు కేటాయించింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. నాగుల్ మీరా గారిని పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ చేశాము.
ముగ్గురు మైనార్టీ సోదరులను రాజ్యసభకు, లాల్ జాన్ బాషా గారిని లోక్సభకు పంపించింది తెలుగుదేశం ప్రభుత్వమే. హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టించింది ఎవరు?హజ్ టెర్మినల్ కట్టింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా హజ్ హౌస్ పనులను టిడిపి ప్రభుత్వమే పూర్తి చేసింది. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్ళిచ్చేందుకు సబ్సీడీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. ముస్లింల కోసం మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందీ తెలుగు దేశం ప్రభుత్వమే.
కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనలో మైనార్టీల మీద దాడులు జరుగుతున్న సంగతి మీకు తెలుసు. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే మైనార్టీ సోదరుడిని వైసీపీ నేతల వేధింపులు భరించలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకొన్నారు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపంగా భావిస్తారు. అయినా అబ్దుల్ సలాం కుటుంబం ఎంత ఆవేదన చెందితే ఆత్మహత్య చేసుకొందో అర్దం చేసుకోవచ్చు.
ఫలమనేరు నియోజకవర్గంలో పదో తరగతి చదువుతున్న ముస్లిం బాలిక చదువులలో నంబర్:1. కానీ ఆమె కారణంగా స్థానిక వైసీపీ నాయకుడు కుమార్తె సెకండ్ ర్యాంక్ వస్తోందని వారి కుటుంబ సభ్యులను వేధించి వేధించి చివరికి ఆ పాపకు టీసీ ఇచ్చి పంపించేశారు. తన వల్ల తన తల్లితండ్రులు వేధింపులు భరించాల్సి వస్తోందని బాధపడిన ఆ పాప ఆత్మహత్య చేసుకొంది. ఓ మైనార్టీ బాలిక చక్కగా చదువుకోవడమే నేరమా? వైసీపీ నేత కుమార్తె కంటే ఎక్కువ మార్కులు సాధించడం నేరమా? అందుకు ఆ పాపకు టీసీ ఇచ్చి పంపేస్తారా?
నేను పుంగనూరులో పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆ పాప తల్లితండ్రులు వచ్చి నన్ను కలిశారు. ఆ పాప వ్రాసుకొన్న డైరీని నాకు చూపారు. దానిలో ఆమె నేను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనుకొంటున్నట్లు వ్రాసుకొంది. అలాంటి ఉజ్వల భవిష్యత్ ఉన్న పాపను అకారణంగా వేధించి ఆత్మహత్య చేసుకొనేలా చేశారు ఈ వైసీపీ నేతలు.
అయితే టిడిపి ఎవరితో పొత్తులు పెట్టుకొన్నా తన సిద్దాంతాలను వదులుకోలేదు. ఎల్లప్పుడూ మైనార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరించింది. కనుక టిడిపిపై మీరు ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోనవసరం లేదు. మేము రాజకీయాల కోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసి రావచ్చు కానీ వాటి వలన ప్రజలకు ఎటువంటి నష్టమూ కలగనీయము అని నేను హామీ ఇస్తున్నాను,” అని నారా లోకేష్ జవాబు చెప్పారు. అది విని ముస్లిం సోదరులు ఆనందంతో చప్పట్లు కొట్టి తమ ఆమోదం తెలిపారు.



