వైజాగ్ స్టీల్ ప్లాంట్ని… దాంతో ముడిపడున్న తమ జీవితాలను కాపాడుకొనేందుకు 40 వేల మంది కార్మికులు పోరాడుతుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలు, స్టీల్ ప్లాంట్ వేదికగా రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడుకొంటున్నాయి. నిజానికి తెలంగాణలో ఆ రెండు పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆదిపత్యపోరునే ఏపీలో కొనసాగిస్తున్నాయని చెప్పవచ్చు.
అయితే ఆంధ్రా ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టేయడంతో ఏపీ బిజెపి నేతలు ఈ విషయంలో కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బహుశః అందుకే అక్కడ తెలంగాణలో కె. లక్ష్మణ్ వంటి నేతలతో కేసీఆర్ని ఎండగట్టిస్తోంది.
ఒక్క హైదరాబాద్లో ఆల్విన్, ప్రాగా టూల్స్, హెచ్ఎంటి, డిబిఆర్ మిల్స్ వంటి అరడజనుకు పైగా భారీ పరిశ్రమలు మూతపడితే వాటి గురించి పట్టించుకొని కేసీఆర్, తెలంగాణ ప్రజల సొమ్ముతో ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడతానంటూ బయలుదేరడం ఏమిటని నిలదీస్తున్నారు. వారికి బిఆర్ఎస్ నేతలు ఏదో సమాధానం చెప్పుకొంటారు. అది మనకు అనవసరం. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి రాష్ట్ర బిజెపి నేతలు ఆంధ్రా ప్రజలకు ఏం సమాధానం చెపుతారనేది ముఖ్యం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఉదయం ఓ మాట, సాయంత్రం ప్లేన్ ఎక్కే ముందు మరో మాట చెప్పడంతో ఏపీ బిజెపి నేతల చేతులు, కాళ్ళే కాదు నోళ్ళు కూడా కట్టేసుకోవలసి వచ్చింది. ఈ విషయంలో బిఆర్ఎస్ అడ్వాంటేజీ సంపాదించుకొంది కనుక “ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు… ఏపీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సాయపడేందుకు నేనున్నాని మంత్రుల చేత కేసీఆర్ చెప్పించుకొన్నారు కూడా!
అంతే కాదు… అప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదుట బిఆర్ఎస్ జెండాలు పెట్టించేశారు! ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్న స్థానిక బిజెపి నేతలు హడావుడిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకొని బిఆర్ఎస్ జెండాలన్నీ పీకేసి తమ బిజెపి జెండాలు పెట్టుకొన్నారు. మంచిదే… కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసి తమను రోడ్డున పడేయబోతున్నందుకు కేంద్రం మీద మండిపడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులే బిజెపి జెండాలను పీకేయకుండా ఉంటారా?



