జీతాలడిగితే వెకిలి నవ్వులు నవ్వుతారా?

Bopparaju_Venkateswarluఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘాలు తమ సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. వాటిలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్ళలో ఉద్యోగులు నల్లా కండువాలు ధరించి, ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం మేము మంత్రుల సబ్ కమిటీతో పలుమార్లు సమావేశమైనప్పుడు మాకు చెల్లించాల్సిన డీఏ ఎరియర్స్, ఇతర బకాయిలు, ప్రభుత్వం వాడేసుకొన్న మా డబ్బు గురించి అడుగుతుంటే వారు పొంతనలేని సమాధానాలు చెపుతున్నారు లేదా వెకిలి నవ్వులు నవ్వుతో మా పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నారు తప్ప ఒక్క సమస్యను పరిష్కరించలేదు.

చివరికి నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రాధేయపడే స్థితికి మమ్మల్ని తీసుకువచ్చి రోడ్లపై నిలబెడుతోంది ఈ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉందని శాసనసభలో గొప్పలు చెప్పుకొన్నారు కదా మరి ప్రతీనెల ఒకటో తేదీన మాకు జీతాలు ఎందుకు చెల్లించడం లేదు? మా బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?మేము మా అవసరాల కోసం దాచుకొన్న సొమ్మును కూడా తీసి ప్రభుత్వం ఎందుకు వాడేసుకొంది?దానిని ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు?అని నిలదీస్తే మంత్రులు తలో మాట చెప్పి తప్పించుకొంటారే తప్ప ఎవరూ సరైన సమాధానాలు చెప్పరు. ఈ ప్రభుత్వం నాలుగేళ్ళుగా మా సమస్యలను నానబెట్టుకొని కూర్చోందే తప్ప ఏ ఒక్కటి పరిష్కరించలేదు.

ADVERTISEMENT

పైగా అంతకు ముందు పీఆర్‌సీలలో సాధించుకొన్నద్ది కూడా నష్టపోతున్నాము. మాచేత నెలంతా పనిచేయించుకొని మాకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?అని మేము అడిగితే, మీ ఉద్యోగుల మీద ప్రభుత్వం ఏడాదికి రూ.90,000 కోట్లు ఖర్చు చేస్తోందంటూ ఓ మంత్రి ఎగతాళిగా మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా మాకు అంత చెల్లిస్తుంటే ఈరోజు ఇలా రోడ్లెక్కి ధర్నాలు ఎందుకు చేస్తాము?

ప్రభుత్వ సలహాదారులకు, వాలంటీర్లకే ప్రభుత్వం ఏకంగా రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తోంది. సలహాదారులకు ఇస్తున్న ప్రాధాన్యత, గౌరవం ప్రభుత్వంలో భాగమై పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవ్వరా?ఇలా నెలనెలా జీతాల కోసం రోడ్లెక్కి దేహీ అంటూ ప్రభుత్వాన్ని అడుక్కొంటూ ఉండాలా? ఇది మాకూ, ప్రభుత్వానికి ఏమైనా గౌరవంగా ఉంటుందా? పొరుగున తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ఒక్క పైసా బాకీ లేకుండా ఇచ్చేస్తుంది. కానీ మన ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోంది?

ప్రభుత్వం మా సహనం పరీక్షిస్తూ నిర్లక్ష్య వైఖరితోనే ఇంతవరకు తెచ్చుకొంది. ఇకనైనా మా సమస్యలన్నిటినీ పరిష్కరించి,బకాయిలు చెల్లించాలని డిమాండ్‌పై చేస్తున్నాము. లేకుంటే మా ఉద్యమం ఇంకా ఉదృతం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగులందరూ కలిసి కట్టుగా పోరాడితేనే, ప్రభుత్వం దిగివస్తుంది. మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం మన మద్య చీలికలు తెచ్చి మనతో నాలుగు స్థంభాలాట ఆడుతోంది. కనుక ఆ మాయలో పడిమోసపోకుండా అందరూ కలిసికట్టుగా పోరాడాలని మేము పిలుపునిస్తున్నాము,” అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories