వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్ తరలించి అక్కడ సిటీ న్యూర్ సెంటర్లో చేర్చారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఆరోగ్యంగా నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
రాష్ట్ర రాజకీయాలలో అత్యంత సీనియర్ నాయకులలో బొత్స కూడా ఒకరు. సమైక్య రాష్ట్రంలోనే పీసీసీ అధ్యక్షుడుగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సిఎం పదవికి గట్టి ప్రయత్నాలే చేశారు కానీ కుదరలేదు. తర్వాత వైసీపీలో చేరి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి, పోయినప్పుడు ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు. ప్రస్తుతం మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్నారు.
ప్రతీరోజూ జగన్ ఇచ్చే లైన్ తీసుకొని ఆయన తరపున కూటమి ప్రభుత్వంతో బొత్స మండలిలో యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. వాటి కారణంగా ఆవేశం… దాంతో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ బ్రెయిన్ స్ట్రోక్ క్రెడిట్ జగన్ పద్దులోనే వ్రాయాల్సి ఉంటుంది. అది వేరే విషయం.
ఏడాది క్రితమే బొత్స సత్యనారాయణ హైదరాబాద్లో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.. చికిత్స చేయించుకుంటున్నారు.
ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలు అన్నీ చూసిన బొత్సకు ఈ వయసులో ఇంకా ఎవరి కోసమో ఇంతగా ఆవేశపడటం, ప్రాణం మీదకు తెచ్చుకోవడం అవసరమా? అనిపించక మానదు. జగన్ కోసం వైసీపీ కోసం బొత్స సత్యనారాయణ తన ప్రాణం పణంగా పెట్టి పోరాడుతున్నారు. పదవి, అధికారం కోసమే ఈ తాపత్రయం కదా? కానీ జగన్ ఉండగా బొత్సకు ముఖ్యమంత్రి పదవి ఎన్నటికీ లభించదు. అంతే కాదు.. 2029 ఎన్నికలలో వైసీపీ తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. గ్యారెంటీ లేని పదవులు, అధికారం కోసం ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా?
బొత్స సత్యనారాయణ ఇప్పటికే భార్యని, వారసులను రాజకీయాలలోకి తెచ్చారు. ఇంకా ఈ తాపత్రయం దేనికి?రప్పా రప్పా అంటూ ఆవేశపడితే ఎవరికి నష్టం? తనకేనని తెలుస్తోంది కదా? అయితే మరెందుకు ఈ తాపత్రయం… ఆవేశం? అవసరమా?




