వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేసి సిఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపదమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే. అయితే టిడిపితో కలిసేందుకు ఇష్టపడని బిజెపితో ముందుకు సాగుతూ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏవిదంగా అడ్డుకోవాలనుకొంటున్నారో ఇంకా తెలియవలసి ఉంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో బీసీలని, ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన కాపులందరినీ ఏకం చేసేందుకు పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఎన్నికల గంట మొగిన తర్వాత పవన్ కళ్యాణ్ టిడిపితో చేతులు కలపడం ఖాయమని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ కాపు ఓటు బ్యాంకుని ఆకర్షించి కొన్ని సీట్లు గెలుచుకొన్నట్లయితే, ఎన్నికల తర్వాత అవసరమైతే ఆయన టిడిపి ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే కాపు ఓట్లను టిడిపికి తాకట్టు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే సిఎం జగన్ పదేపదే ఆయనని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని ఆక్షేపిస్తున్నారు.
ఇక 11 ఏళ్లపాటు అవిశ్రాంతంగా పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి తెలంగాణ ఏర్పాటు చేసుకొని వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, తన బిఆర్ఎస్ పార్టీతో ఏపీలో ప్రవేశించబోతున్నారు. రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకి బిఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రకటించేశారు. బిఆర్ఎస్ని ఆంద్రా ప్రజలు ఆదరిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ పార్టీ బరిలో దిగితే ఓట్లు చీల్చడం మాత్రం ఖాయమే.
కేసీఆర్ కూడా ముందుగా రాష్ట్రానికి చెందిన కాపు నాయకులనే బిఆర్ఎస్లోకి ఆకర్షించి చేర్చుకోవడం గమనిస్తే ఆయన కాపు, బీసీ ఓట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నారని అర్దం అవుతోంది. వచ్చే ఎన్నికలలో ఏపీలో తన పార్టీ అభ్యర్ధులు ఓడిపోతే ఆయనకి రాజకీయంగా ఎదురుదెబ్బ, అప్రదిష్ట. కేసీఆర్ వద్ద డబ్బుకి కొదవలేదు కనుక వారిని గెలిపించుకోవడానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఖాయం. కనుక ఆయన బీసీ, కాపు ఓట్లను చీల్చడం ఖాయమనే భావించవచ్చు. అదే జరిగితే టిడిపి, జనసేనలు నష్టపోతాయి. దాంతో వైసీపీకి మేలు కలుగుతుంది.
ఒకవేళ ఎన్నికల తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాలేకపోతే, వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు బహిరంగంగా, ధైర్యంగా పరస్పరం సహకరించుకోవడం కూడా ఖాయమే. కనుక ఏపీలో బిఆర్ఎస్ ప్రవేశంతో టిడిపి, జనసేనలకు ఎంతోకొంత నష్టం, వైసీపీకి ఎంతో కొంత లాభం కలగడం తధ్యమే.



